షాక్: 9మంది కాంగ్రెస్, రేవంత్-సండ్రల సస్పెన్షన్, జానా హెచ్చరిక, హరీష్ కౌంటర్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో శనివారం ఉదయం గందరగోళం చోటు చేసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన 9మంది ప్రజాప్రతినిధులను సభ నుంచి సస్పెండ్ చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో శనివారం ఉదయం గందరగోళం చోటు చేసుకుంది. సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై చర్చకు పట్టుబట్టారు.
దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన 9మంది ప్రజాప్రతినిధులను సభ నుంచి సస్పెండ్ చేశారు. డీకే అరుణ, జీవన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, చిన్నా రెడ్డి, గీతారెడ్డి, పద్మావతిరెడ్డిలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనైతికంగా వలసలను ప్రోత్సహిస్తున్నారని వారు మండిపడ్డారు.
ఉనికి చాటుకునేందుకే అడ్డుకుంటున్నారు
కాంగ్రెస్ పార్టీ సభ్యులు తమ ఉనికిని చాటుకునేందుకే సభను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నోత్తరాల సమయాన్ని వృధా చేస్తోందన్నారు.
జానా రెడ్డి ఆగ్రహం
కాంగ్రెస్ సభ్యులను ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేయడంపై జానా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ సభలోని వారినందరినీ సమదృష్టితో చూడాలన్నారు. సభ నడుస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. సభలో సభ్యుల వాదన కూడా వినడం లేదన్నారు.

సభలో ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే సభకు రాకుండా ప్రజల్లోకి వెళ్లాలనిపిస్తోందన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరించవద్దన్నారు. పార్లమెంటు 21 రోజులు జరిగిందని, కానీ ఒక్కరిని కూడా సస్పెండ్ చేయలేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ తీరును దేశం మొత్తం గమనిస్తోందన్నారు. విధానాన్ని స్పీకర్ సరిచేయాలని, లేదంటే వాకౌట్ చేస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది
కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో జై తెలంగాణ అన్నందుకు జానారెడ్డి ముందే తమను ఎన్నిసార్లు సస్పెండ్ చేశారో చెప్పాలన్నారు. అప్పుడు ఏమయిందో పెద్దలు జానారెడ్డి చెప్పాలన్నారు.
ఢిల్లీలో 21 రోజులు పార్లమెంటు జరిగితే సస్పెండ్ చేయలేదని చెబుతున్నారని, ఢిల్లీలో అడ్డుకున్నామని, తెలంగాణలోను సభను అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారని మండిపడ్డారు. ఏదో ఒక రాద్దాంతం చేసి, రచ్చ చేసి సభను తప్పుదోవ పట్టించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. సభలో చర్చ జరగాలని సభ్యులంతా కోరుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం రచ్చ జరగాలని కోరుకుంటోందన్నారు.
టిడిపి సభ్యుల సస్పెన్షన్
కాంగ్రెస్ పార్టీ సభ్యుల తర్వాత టిడిపి సభ్యులను కూడా సస్పెండ్ చేశారు. టిడిపి సభ్యులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలను కూడా సభను అడ్డుకుంటున్నారని సస్పెండ్ చేశారు. మొత్తం కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది, టిడిపికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ చర్యతో ప్రతిపక్షాలు నిర్ఘాంతపోయాయి.












Click it and Unblock the Notifications