Monsoon: చల్లటి కబురు..! మళ్లీ రుతుపవనాలొచ్చేస్తున్నాయ్..!
పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావంతో భారత్ లో ప్రస్తుతం వర్షాకాలం కూడా వేసవి తాపంతో నిండిపోతోంది. జనం కొన్ని రోజులుగా తీవ్రమైన వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్నారు. నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) పలకరించినా తిరిగి మొహం చాటేయడమే ఇందుకు కారణం. అయితే తాజాగా పరిస్ధితుల్లో క్రమంగా మార్పు వస్తోంది. దీంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని, దాని ప్రభావంతో రుతుపవనాలు తిరిగి పుంజుకుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఒక శక్తివంతమైన వాతావరణ వ్యవస్థ ప్రస్తుతం బంగాళాఖాతం దిశగా పయనిస్తోందని వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో దేశంలో కొంతకాలంగా బలహీనపడిన నైరుతి రుతుపవనాలు త్వరలో మళ్లీ పుంజుకోనున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో జరుగుతున్న మార్పుల వల్ల సముద్రపు గాలులు బలంగా వీస్తూ, దట్టమైన మేఘాలు అలుముకుంటున్నాయి. రెండు మూడు రోజుల్లో ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ అల్పపీడన వ్యవస్థ క్రమంగా ఒడిశా, బెంగాల్ తీరాల వైపు ప్రయాణించి, తూర్పు భారతదేశంలో వర్షాలు కురిపించనుంది. ఆ తర్వాత రాబోయే వారాల్లో దీని ప్రభావం మధ్య, ఉత్తర భారత దేశాలపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జూలై మొదటి వారంలో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినా.. ఆ తర్వాత మాత్రం రుతుపవనాల్లో హఠాత్తుగా స్తబ్దత ఏర్పడింది. దీనివల్ల దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణ స్థాయి కంటే పడిపోవడమే కాకుండా, ఎండ తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు ఎగబాకాయి. ఇది వర్షాల కొరతను మరింత తీవ్రతరం చేయడమే కాకుండా, దేశవ్యాప్తంగా ఖరీఫ్ పంటల సాగుపై ప్రతికూల ప్రభావం చూపింది. సమయానికి వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి వంటి ప్రధాన పంటల నాట్లు వేయడం కూడా బాగా ఆలస్యమవుతోంది. కానీ ఇప్పుడు బంగాళాఖాతంలో మారిన పరిస్ధితులు రైతులతో పాటు సాధారణ జనానికి సైతం ఊరటనిచ్చేలా ఉన్నాయి.















Click it and Unblock the Notifications