కేటీఆర్ పై భారీగా కౌంటర్లు- కవితతో కంపేర్
తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశించి భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, సవాళ్లు దుమారం రేపుతున్నాయి. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ముందా? అంటూ కేటీఆర్ చేసిన సవాల్ పట్ల కాంగ్రెస్ నాయకులు ధీటుగా స్పందిస్తోన్నారు. అదే స్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్.. కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. ఇటువంటి సవాళ్లు విసిరే హక్కు ఆయనకు లేదని విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వలసలను ప్రోత్సహించలేదా? అని ప్రశ్నించారు. ఇతర పార్టీల నుండి 39 మంది ఎమ్మెల్యేల, ముగ్గురు ఎంపీలు, 16 మంది ఎమ్మెల్సీలను చేర్చుకున్నప్పుడు.. వాళ్లతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. అప్పుడు కేటీఆర్ కు ధైర్యం లేదా? అని అన్నారు.

కాలక్రమేణా బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోతుందని అద్దంకి దయాకర్ జోస్యం చెప్పారు. తన సొంత చెల్లెలు కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేని కేటీఆర్.. ఇప్పుడు ధైర్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై హైకోర్టు, సుప్రీంకోర్టుకు సైతం కేటీఆర్ వెళ్లాడని, ప్రస్తుతం అది స్పీకర్ పరిధిలో విచారణ దశలో ఉందని గుర్తు చేశారు.
అయినప్పటికీ కేటీఆర్.. ఆ అంశాన్ని పట్టుకుని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోన్నాడని అద్దంకి దయాకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ బలహీనపడిందని, ఆ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోతోందని అన్నారు. తెలంగాణలో కనుమరుగు అవుతున్న పార్టీకి నాయకుడిని అనుకుంటే అది కేటీఆర్ భ్రమేనని, రాష్ట్రంలో దాని పరిస్థితి ఎంతో ఘోరంగా తయారైందని చెప్పారు. కవిత బయటికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా దిగజారిందని, వాళ్లల్లో వాళ్లకే దిక్కులేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డికి దమ్ముంది కాబట్టే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలతో కూడిన బీఆర్ఎస్ ను ఓడించాడని అన్నారు. రేవంత్ రెడ్డి దెబ్బకు ఒకరు ఫామ్హౌస్కు, మరొకరిని వీధి రాజకీయాలకు పరిమితం అయ్యారని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. తెలంగాణ సమాజాన్ని వంచించిన బీఆర్ఎస్ ను ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని అన్నారు.












Click it and Unblock the Notifications