మోదీకి లొంగిపోయిన కేసీఆర్.. ఇద్దరివీ నీతిమాలిన రాజకీయాలే.. రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్లలో ఎన్నికల కోసమే రైతుల చట్టాలను మోదీ సర్కార్ వెనక్కి తీసుకుందని ఆరోపించారు. మళ్లీ ఆ చట్టాలను తీసుకొస్తామన్నట్లుగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ మాట్లాడుతున్నారన్నారని దుయ్యబట్టారు. ఆ నల్ల చట్టాలను తెస్తే సీఎం కేసీఆర్ ఎవరి పక్షాన నిలబడతారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి .

ప్రధాని మోదీకి లొంగిపోయిన సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లొంగిపోయారని రేవంత్ రెడ్డి ఆరోపించారు . కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలో భాగంగా రాష్ట్రంలో మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారని పేర్కొన్నారు. కానీ, ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతిచ్చేందుకు సీఎం కేసీఆర్కు మనస్సు రాలేదని మండిపడ్డారు. ఢిల్లీ ఉద్యమంలో అమరులైన 700 మంది రైతులకు రూ.3లక్షల చొప్పున పరిహారమిస్తామని సీఎం కేసీఆర్ ఆర్భాటంగా ప్రకటించారన్నారు. కానీ, నేటి వరకు అణాపైసా కూడా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఢిల్లీలో వారం రోజులు పాటు ఉన్న మంత్రుల బృందం ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలను కూడా తీసుకునే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎంపీలు మోదీకి భయపడి పార్లమెంటు సెంటల్ హాల్లో బాతాకాని కొట్టారని ఎద్దేవా చేశారు.

నమ్మించి మోసం చేయడంలో దిట్ట..
ప్రజలను నమ్మించి మోసం చేయడంలో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకరిని మించిన మరొకరని రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతులు ఎంత వరి ధాన్యం పండించినా కొని తీరాల్సిందేనన్నారు . యాసంగిలో వడ్లు వేయాలని.. ఎట్లా కొనడో చూద్దామన్నారు. వడ్లు కొనకపోతే టీఆర్ఎస్ సర్కార్ ను బొందలో పెడతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ధాన్యం కొనని కేసీఆర్కు సీఎం కుర్చీలో కూర్చుకునే అర్హత లేదన్నారు. గ్రామాల్లోకి వచ్చే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, మంత్రులను చెప్పులతో కొట్టాలని పిలుపునిచ్చారు.

రైతుల పొలాలు బీడుగా.. నీ భూములు పచ్చగానా..
రైతులను వరి వేయోద్దన్న కేసీఆర్ .. తన భూమిలో మాత్రం వరి పండిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ధాన్యాన్ని ఏక్కడ అమ్ముతారో చెప్పాలని డిమాండ్ చేశారు.. రైతుల పొలాలు బిడులుగా మారాలి .. నీ భూములు మాత్రం పచ్చగా ఉండాలా.. అని రేవంత్ రెడ్డి నిలదీశారు.. తెలంగాణ రైతులకు ఒక న్యాయం నీకు ఒక న్యాయమా అని దుయ్యబట్టరారు.

కొర్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న మోదీ..
మోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతుల హక్కులను కాలరాసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికల కోసమే నల్లచట్టాలను వెనక్కి తీసుకుందని విమర్శించారు . రైతులు, కాంగ్రెస్ పోరాటంతో దిగివచ్చిన మోదీ క్షమాపణలు చెప్పి సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నారని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు దళారులు ధరలు నిర్ణయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో వరికి రూ. 400 ఉన్న మద్దతు ధరను రూ. 1000 పెంచిందని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం మాత్రం కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తుందని రేవంత్ విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications