కలకలం: వేటకొడవళ్లతో నరికి కాంగ్రెసు ఎపిటిసి సభ్యుడి హత్య
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపిటిసి సభ్యుడు అరుణాచలం రాజు (51) దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో దేవరకద్ర పట్టణంలోని తన ఇంటి నుంచి అరుణాచలం రాజు మార్నింగ్ వాక్కు బయలుదేరారు.
పాత బస్టాండ్ ప్రాంతంలో మాటు వేసిన ముగ్గురు గుర్తుతెలియని దుండగులు వేట కొడవళ్లతో అతన్ని వెంబడించి అతి దారుణంగా హత్య చేశారు. మృతుడు తమిళనాడు నుండి 50 ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. 30 ఏళ్లకు పైగా టిడిపిలో దేవరకద్ర మండలంలో క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు.
2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి గూరకొండ గ్రామ ఎంపిటిసిగా గెలుపొందారు. అరుణాచలం రాజు రాజకీయ జీవితంలో మూడుసార్లు దేవరకద్ర పట్టణంలోని 14వ వార్డు సభ్యుడిగా, 2006 నుంచి 2011 వరకు దేవరకద్ర సర్పంచ్గా పనిచేశారు. ఈ హత్య ఏ కోణంలో జరిగిందనే దానిపై పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
గద్వాల డిఎస్పీ బాలకోటితో పాటు ముగ్గురు సిఐలు, 15 మంది ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు. కాగా, అరుణాచలం రాజు హత్యకు గురైన సమాచారం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ దేవరకద్ర నియోజకవర్గ ఇన్చార్జి పవన్కుమార్రెడ్డి, జడ్పీటిసి లక్ష్మికాంతరెడ్డి, ఎంపిపి ఇవి గోపాల్, ప్రదీప్కుమార్గౌడ్, కుర్వ రాందాస్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మృతదేహంతో రాస్తారోకో
గూరకొండ ఎంపిటిసి సభ్యుడు అరుణాచలం రాజు దారుణ హత్యకు గురికావడం దేవరకద్ర పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అయితే అరుణాచలం రాజును హత్య చేసిన దుండగులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ అంతర్రాష్ట్ర రహదారిపై కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
ఆ తర్వాత జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిపి, మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు డిఎస్పీ బాలకోటి తెలిపారు.