కాంగ్రెస్ టీడీపీ పొత్తు ఈస్ట్ ఇండియా కంపెనీని తలపిస్తోంది: అసదుద్దీన్ ఓవైసీ
సంగారెడ్డి: తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో వేగం పెంచుతుండగా ఇక టికెట్ల కేటాయింపులో బిజీగా మారింది ప్రజాకూటమి. ఇక నేతలు ఇప్పటికే ప్రచారంలో దిగి తమ సత్తాను చాటుతున్నారు. అధికార పక్షం వారు విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వారిపై దండెత్తుతున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్కు మద్దతుగా ఉన్న మజ్లిస్ పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తుపై నిప్పులు చెరిగారు. ఈ రెండు పార్టీలు ఈస్ట్ ఇండియా కంపెనీని తలపిస్తున్నాయని తనదైన శైలిలో విమర్శించారు అసదుద్దీన్.
సంగారెడ్డిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో జతకట్టడమేంటని ప్రశ్నించారు. తెలంగాణను ఈ రాష్ట్ర సంస్కృతిని చంద్రబాబు పరిరక్షిస్తారా లేక కాంగ్రెస్ ఆ బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించారు. ఇది మహాకూటమి కాదని 2018 ఈస్ట్ ఇండియా కంపెనీ అని అసదుద్దీన్ అన్నారు. తెలంగాణ తలరాతను తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారని చెప్పిన అసదుద్దీన్ మరో ప్రాంతం నుంచి వచ్చిన నేతలు కాదని పరోక్షంగా చంద్రబాబుకు చురకలు అంటించారు.
"విజయవాడలో ఉన్న చంద్రబాబు, నాగ్పూర్లో ఉన్న ఆర్ఎస్ఎస్, లేక ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ తలరాత ఇక్కడి ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తారా? తెలంగాణ తలరాతను ఇక్కడి ప్రజలే నిర్ణయిస్తారు. ఇది మీ రాష్ట్రం. ఇక్కడి ప్రజల నిర్ణయమే శిరోధార్యం. అంతేకానీ విజయవాడ, నాగ్పూర్, ఢిల్లీల నిర్ణయం ఇక్కడ చెల్లదు. ఈ మోడ్రన్ ఈస్ట్ ఇండియా కంపెనీని డిసెంబర్ 7న వారి ప్రాంతాలకు తరిమికొట్టాలి"అని అసదుద్దీన్ ధ్వజమెత్తారు.