ఆయన వల్లే తెలంగాణలో ఆనందం: తెలుగులో మోడీ, చంద్రబాబుపై నిప్పులు, 'బీ' టీంపై గట్టి కౌంటర్
Recommended Video
హైదరాబాద్: భాగ్యనగరంలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 'ఎందరో అమరవీరులు కన్నకలల సాకారం కోసం, మార్పు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో ఆశలతో వేలాదిగా తరలి వచ్చిన తెలంగాణ అందరికీ హృదయపూర్వక వందనం' అని మొదలు పెట్టారు.
ఆ తర్వాత హైదరాబాదు గురించి, సర్దార్ వల్లభాయ్ పటేల్కు నగరంతో ఉన్న సంబందం గురించి కూడా తెలుగులో ప్రసంగించారు. హైదరాబాద్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తనకు ఆదర్శమని చెప్పారు. పటేల్ పట్టుదల వల్లనే హైదరాబాద్కు విమోచనం జరిగిందన్నారు. అందుకే హైదరాబాద్ అనగానే తనకు పటేల్ గుర్తుకు వస్తారని చెప్పారు. అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే ఈనాడు తెలంగాణలో మీతో ఆనందంగా మాట్లాడే అవకాశం కలగకపోయేదని చెప్పారు. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా ఖ్యాతిని సంపాదించిపెట్టిన తెలుగు ప్రజలందరికీ తన శుభాభినందనలు అన్నారు. నాడు పటేల్ లేకుంటే నేడు తెలంగాణ ఇలా ఉండేది కాదని చెప్పారు.
ఈ ఎన్నికలు బీజేపీవే
వంశపారంపర్య రాజకీయాలకు చెక్ పెట్టాలని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం గొంతు నులిపేస్తున్నారని ఆరోపించారు. అందుకే కొత్త కొత్త రాజులు పుట్టుకు వస్తున్నారని చెప్పారు. ఈ రాజులను తరిమేసి దేశాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని చెప్పారు. వారసత్వ, కుటుంబ రాజకీయాలు లేని ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. ఈ ఎన్నికలు పూర్తిగా బీజేపీవే అన్నారు.
చంద్రబాబు స్వార్థం కోసం కలిశారు
కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పునాదులపై స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని మోడీ చెప్పారు. కానీ ఇప్పుడు స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు దానిని కాంగ్రెస్ పార్టీకి తాకట్టుపెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీలు వారసత్వ పార్టీలు అన్నారు. దేశంలో వారసత్వ రాజకీయాలకు తావు లేదని చెప్పారు. ఒక ప్రధాన పార్టీ కొన్ని దశాబ్దాలుగా ఒక కుటుంబం చేతిలో చిక్కుకుందని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నారు.
మజ్లిస్ పార్టీది మరో తరహా రాజకీయం
తెలంగాణలో మజ్లిస్ పార్టీది మరో తరహా రాజకీయమని నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. తెరాస అయినా, టీడీపీ అయినా, కాంగ్రెస్ అయినా, మజ్లిస్ అయినా.. వారసత్వ పార్టీలే అన్నారు. కుటుంబం, వారసత్వంతో పాటు మతాన్ని నమ్ముకున్న పార్టీ మజ్లిస్ అన్నారు. టీడీపీ పార్టీ కూడా కుటుంబ, వారసత్వ రాజకీయాలనే నమ్ముకుందని చెప్పారు. తెలంగాణ ఎన్నికల నుంచే వారసత్వ రాజకీయాలను తరిమేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ పుట్టింది తెలుగువారి ఆత్మగౌరవం కోసమని, కానీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీతో కలిశారన్నారు.
బీజేపీ మాత్రమే లౌకికవాద పార్టీ
మీరు లౌకికవాదులు అయితే వారసత్వ రాజకీయాలకు స్వస్థీ చెప్పాలని కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు ప్రధాని మోడీ సవాల్ విసిరారు. కుటుంబ రాజకీయాలు దేశానికి ముప్పు అని చెప్పారు. మజ్లిస్ కుటుంబ రాజకీయ పార్టీ కాదా అని ప్రశ్నించారు. లౌకికవాదం ఉన్న పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. ఈ ఎన్నికలు బీజేపీ ఎన్నికలు అని స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు. అందుకే కొత్త రాజులు పుట్టుకు వస్తున్నారని చెప్పారు. ఆ రాజులను తరిమేయాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలా లేదా తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. కర్ణాటక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ జేడీఎస్ను పలుమార్లు బీజేపీ బీ టీం అని వ్యాఖ్యానించిందని, ఆ తర్వాత ఏమయిందో అందరికీ తెలుసునని చెప్పారు. తెలంగాణలోను తెరాసను బీజేపీ.. బీ టీమ్ అని చెబుతున్నారని, కానీ ఇక్కడ వారిద్దరు ఒక్కటే కావొచ్చునని చెప్పారు.