4 వరకు కేసీఆర్ సర్కారును కట్టడి చేయండి: సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు, సంచలన ఆరోపణలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ను కలిశారు కాంగ్రెస్ నేతలు. శనివారం ఈసీ కార్యాలయానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు.. నాలుగు అంశాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు.
అనంతరం ఈసీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయిస్తున్నారని తెలిపారు. రూ. 6 వేల కోట్లను తమకు వచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు బీఆర్ఎస్ సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలు పాటించడం లేదన్నారు.

రైతుబంధు నిధుల్ని కాంట్రాక్టర్ల బిల్లులకు మళ్లిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. భూ రికార్డులు మారుస్తున్నట్లు కూడా తమకు సమాచారం ఉందని.. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని భూముల్ని ధరణి పోర్టల్లోకి మారుస్తున్నారని చెప్పారు. ఈ విషయాలన్నింటినీ సీఈవో వికాస్ రాజ్ దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు.
అసైన్డ్ భూముల రికార్డులు మార్చకుండా చూడాలని కోరామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని కోరినట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరినట్లు చెప్పారు. డిసెంబర్ 4వ తేదీన జరగబోయే కేబినెట్ భేటీలో కేసీఆర్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిలువరించాలని ఈసీని కోరినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
కాగా, మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో ఆ పార్టీ నేతలు ఉత్సాహంగా ఉన్నారు. తామే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రం తాము ఎగ్జిట్ పోల్ ఫలితాలను తారుమారు చేస్తామంటున్నారు. ఏది ఏమైనా మరికొద్ది గంటల్లో అంటే డిసెంబర్ 3న మధ్యాహ్నంకల్లా అసలైన ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications