వివాదాస్పద నిర్ణయం: తెలుగు మీడియం వద్దు ఇంగ్లీష్ మీడియం ముద్దు
ఆచార్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి, డిఈఓ వీపీ గౌతం ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి.
భూపాలపల్లి: ఆచార్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి, డిఈఓ వీపీ గౌతం ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి.జిల్లాలో ప్రస్తుతం నడుస్తున్న తెలుగు మీడియం స్కూళ్ళను ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళుగా మార్చాలని ఆదేశాలు జారీ చేశారు.
తెలుగు మీడియం స్కూళ్ళను ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళుగా మార్చాలని ఉత్తర్వులు జారీ చేయడమే కాదు, వీలైతే 2017-18 విద్యాసంవత్సరం నుండి ఇంగ్లీష్ విద్యాబోధన సాగించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఉత్తర్వులను అమలు చేసేందుకు వెంటనే చర్యలను తీసుకోవాలని కలెక్టర్, డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తెలుగు మీడియం స్కూళ్ళను ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళుగా మార్చేందుకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదన్నారు.
తెలుగు మీడియం స్కూళ్ళను ఇంగ్లీష్ మీడియంగా మార్పు
ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి.. జిల్లాలో ఇప్పటి వరకూ తెలుగు మీడియంలో నడుస్తున్న మొత్తం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఇంగ్లిషు మీడియం పాఠశాలలుగా మార్చాలని జిల్లా కలెక్టర్, డీఈవో నిర్ణయించారు. ఇలా మార్చుకునేందుకు ప్రధానోపాధ్యాయులకు అనుమతి ఇస్తున్నాం. ఇందుకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ తీర్మానాలను తీసుకోవాలి. వాటితోపాటు టీచర్లు, హెచ్ఎంలు అంగీకరిస్తే, వెంటనే (2017-18) విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లీషు మీడియంలో బోధన ప్రారంభించాలి'' అని జిల్లాలోని అన్ని స్కూళ్లకు భూపాలపల్లి జిల్లా విద్యా శాఖాధికారి వీపీ గౌతం (ఐఏఎస్) ఆదేశాలిచ్చారు.
ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదు
సెప్టెంబరు 25న ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు డీఈవో కార్యాలయం నుంచి ప్రత్యేకంగా ఉత్తర్వులు అవసరం లేదన్నారు.ఈ ప్రొసీడింగ్నే అదనపు అనుమతులు అవసరం లేకుండా పరిగణించాలని స్పష్టం చేశారు. అయితే, భూపాలపల్లి కలెక్టర్, డీఈవో నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. నిజానికి, రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంలో విద్యా బోధన అందించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అందుకే దశలవారీగా ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వమూ భావిస్తోంది.
విద్యాసంవత్సరం మధ్యలో
తెలుగు మీడియం స్కూళ్లను ఇంగ్లీషు మీడియంగా మార్చాలంటే, పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో బోధించే ఉపాధ్యాయులు ఉం డాలి. విద్యార్థులకు ఇంగ్లిషు మీడియం పుస్తకాలు అందుబాటులో ఉండాలి. ఇటువంటి నిర్ణయాలను విద్యా సంవత్సరం ప్రారంభంలో తీసుకుంటారు. కానీ, విద్యా సంవత్సరం ప్రారంభమై ఇప్పటికే నాలుగు నెలలైంది. ఎఫ్ఏ 1, 2 పరీక్షలూ పూర్తయ్యాయి. విద్యా సంవత్సరం మధ్యలో ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఏమిటనే విస్మయం వ్యక్తమవుతోంది.
డీఈఓలకు అధికారం ఉందా?
ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలనూ ఇంగ్లిషు మీడియంగా మార్చే అధికారం డీఈవోకు లేదు. ప్రాథమికోన్నత స్థాయి వరకే ఆంగ్ల మాధ్యమం ప్రారంభించేందుకు డీఈవోలకు అధికారం ఉంది. ఇంకా చెప్పాలంటే, తెలుగు మీడియంను ఎత్తివేసే; తెలుగు మీడియం స్కూళ్లను రద్దు చేసే అధికారం ఎవరికీ లే దు. వాటికి సమాంతరంగా ఇంగ్లిషు మీడియాన్ని ప్రారంభించే అధికారమే డీఈవోలకు ఉంటుంది. తెలుగు మీడియం స్కూళ్లను రద్దు చేసి.. ఇంగ్లిషు మాధ్యమంగా మారుస్తూ ఉత్తర్వులివ్వడం వివాదాస్పదమవుతోంది. నిబంధనల ప్రకారం, హైస్కూళ్లకు అనుమతి, రద్దు, ఇంగ్లీషు మీడియంగా మార్పు వంటి అంశాలపై పాఠశాల విద్యా రీజినల్ డైరెక్టర్ ప్రతిపాదనల మేరకు పాఠశాల విద్యా కమిషనర్ అనుమతులిస్తారు.