చంద్రబాబులేఖపై చిచ్చు: దిష్టిబొమ్మ దగ్ధం, రేపు పాలమూరు బంద్
మహబూబ్నగర్: పాలమూరు ఎత్తిపోతల ప్రజెక్టు నిలిపివేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాయడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వివాదంగా మార్చింది. చంద్రబాబు లేఖకు నిరసనగా రేపు (శుక్రవారం) మహబూబ్నగర్ జిల్లా బంద్కు టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.
బంద్కు ప్రజలు, విద్య, వ్యాపార, వాణిజ్య సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ కోరారు. తెలంగాణ వచ్చిన తర్వాత చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకుంటున్న చంద్రబాబుకు బంద్ ద్వారా గుణపాఠం చెప్పాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.
చంద్రబాబునాయుడిపై మహబూబ్నగర్ ప్రజలు తీవ్ర నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుమతులు లేవంటూ దానిని నిలిపివేయాలని కోరుతూ ఏపీ సీఎం సీడబ్ల్యూసికీ లేఖ రాసినందుకు నిరసనగా గురువారం ఆందోళనలు చేపట్టిన మహబూబ్నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. అదేవిధంగా జడ్చర్లలో బాబు దిష్టిబొమ్మ దహనంతో రాస్తారోకోను నిర్వహించి నిరసన కార్యక్రమాలను చేపట్టారు.
పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలనే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశాడని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాను చంద్రబాబు వల్లకాడు చేయాలని చూస్తున్నారని ఆయన గురువారంనాడు దుయ్యబట్టారు.
సమైక్య రాష్ట్రంలోనే పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతి వచ్చిన విషయం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును అనధికారికంగా నిర్మిస్తున్నారు. ఎవరడ్డొచ్చినా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం ఆగదని మంత్రి తేల్చి చెప్పారు. దాన్ని వీలైనంత త్వరగా నిర్మించి తీరుతామని ఆయన అన్నారు.