coronavirus: తెలంగాణ సచివాలయ ఉద్యోగి కరోనా నెగిటివ్, ఊపిరి పీల్చుకున్న సిబ్బంది...
తెలంగాణ సచివాలయ ఉద్యోగికి కరోనా నెగిటివ్ వచ్చింది. ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన ఉద్యోగికి జరిపిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ అని తేలింది. ఉద్యోగి కూడా మత ప్రార్థనలకు హాజరవడంతో ఆందోళన నెలకొంది. వెంటనే అతనికి వైద్య పరీక్షలు చేశారు. కరోనా నెగిటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఉద్యోగిని హోం క్వారంటైన్లో ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. 14 రోజుల క్వారంటైన్ తర్వాత.. పరీక్ష చేసి.. నెగిటివ్ వస్తే సచివాలయంలోకి వచ్చేందుకు అనుమతిస్తామని పేర్కొన్నారు.
సచివాలయ ఉద్యోగి..
రాష్ట్ర గుండెకాయ సచివాలయం. పరిపాలనా విభాగం అంతా అక్కడే కేంద్రీకృతమవుతోంది. అసలే కరోనా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో సచివాలయం కీ రోల్ పోషిస్తోంది. అందులో ఒక ఉద్యోగికి కరోనా లక్షణాలు ఉన్నాయని తెలియడంతో. సెక్రటేరియట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
మర్కజ్ వెళ్లి..
హైదరాబాద్లోని తాత్కాలిక సచివాయలం బీఆర్కే భవన్లో పనిచేస్తున్న ఓ ఏఎస్వో అధికారి మార్చి 13-15 తేదీల్లో నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లి వచ్చినట్టుగా గుర్తించారు. మర్కజ్లో మత ప్రార్థనలకు వెళ్లినవారి వివరాలు ప్రభుత్వానికి అందడంతో ఈ విషయం బయటపడింది. మంగళవారం మధ్యాహ్నం సచివాలయంలోని ఉద్యోగులందరినీ ప్రభుత్వం ఖాళీ చేయించింది. అనంతరం సచివాలయం మొత్తాన్ని శానిటైజేషన్ చేశారు.
పశు సంవర్ధకశాఖ ఉద్యోగి..
ఆ అధికారి పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్నారని తెలిసింది. మార్చి 29వ తేదీ వరకు అతను విధులకు హాజరైనట్టు తెలుస్తోంది. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చినప్పటికీ.. ఆ సమాచారాన్ని అతను గోప్యంగా ఉంచినట్టు చెబుతున్నారు. ఐఏఎస్లతో నిర్వహించిన కీలక సమావేశాల్లోనూ అతను పాల్గొన్నట్టుగా చెబుతున్నారు.
మర్కజ్ ప్రార్థనలు..
తెలంగాణ రాష్ట్రం నుంచి 1030-2000 పైచిలుకు మంది ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు హాజరైనట్టుగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వీరందరినీ స్వచ్చందంగా రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో కొందరు స్వచ్చందంగా ముందుకు రాగా.. ఇంకా చాలామందిని గుర్తించాల్సి ఉంది. వారితో పాటు.. వారు ఎవరెవరిని కలిశారు.. ఎక్కడెక్కడ తిరిగారు.. అన్న వివరాలను కూడా ఆరా తీస్తున్నారు.
వివరాల సేకరణ
మర్కజ్ వెళ్లి వచ్చినవారితో కలిసినవారి వివరాలను సేకరిస్తూ.. వారిని ఇళ్లల్లోనే క్వారెంటైన్ చేస్తున్నారు. ఆ ఇళ్లకు క్వారెంటైన్ స్టిక్కరింగ్ కూడా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని చెబుతున్నారు. ఇప్పటివరకు ఒక్క హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోనే మర్కజ్ వెళ్లొచ్చినవారు దాదాపు 600 పైచిలుకు మంది ఉంటారని అంచనా వేస్తున్నారు.