విషాదం: పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య, అనాథలైన పిల్లలు
తరుచుగా గొడవలు పడుతూ భార్యాభర్తలు చివరకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో పిల్లలు అనాథలయ్యారు.
హైదరాబాద్: కుటుంబ కలహాలతో విసిగిపోయిన భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి పిల్లలు దిక్కులేనివారయ్యారు. పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దంపతులు అసువులు బాశారు. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
రాజేంద్రనగర్ ఉప్పర్పల్లికి చెందిన లక్ష్మారెడ్డి(33), యాదాద్రి జిల్లా వలిగొండకు చెందిన కృష్ణారెడ్డి కూతురు కవిత(25)కు నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. లక్ష్మారెడ్డి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. వీరికి ప్రణవ్రెడ్డి(5), ఐదు నెలల వయసున్న చోటు కుమారులు. ఏడాదిగా దంపతుల మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి.
ఈ క్రమంలో ఈ నెల 13వ తేదీన ఇంట్లో భార్యాభర్తలు పురుగుల మందు తాగారు. దాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వారిని హైదరాబాదు నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కవిత గురువారం తెల్లవారుజామున మృతిచెందగా, భర్త లక్ష్మారెడ్డి గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు.
తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో చిన్నారులు అనాథలయ్యారు. తన కూతురు మృతికి ఆమె భర్త లక్ష్మారెడ్డి, అత్త శేషమ్మ కారణమని ఆరోపిస్తోూ కవిత తండ్రి కృష్ణారెడ్డి గురువారం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్రనగర్ ఎస్సై నారాయణరెడ్డి తెలిపారు.