తెలంగాణలో కరోనా: తగ్గిన ఉధృతి -కొత్తగా 163 కేసులు, ఒకరి మృతి -నేడు పల్స్ పోలియో టీకాలు
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృది కొద్దిగా తగ్గింది. టెస్టుల సంఖ్య అదే స్థాయిలో ఉన్నా, కొత్త కేసుల సంఖ్య తగ్గింది. డిశ్చార్జీలు పెరగడంతో యాక్టివ్ కేసులు తగ్గాయి. కరోనా వ్యాక్సినేషన్లతోపాటు ఇవాళ పల్స్ పోలియో టీకాలు కూడా అందజేస్తున్నారు..
రాష్ట్ర రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన కరోనా బులిటెన్ వివరాల ప్రకారం... గడిచిన 24 గంటల్లో కొత్తగా 163 కేసులు, ఒక మరణం నమోదు చేసుకుంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,469 కి చేరింది. మరణాల సంఖ్య 1599కి పెరిగింది. ఇక..
గడిచిన 24 గంటల్లో 276 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. తద్వారా మొత్తం రికవరీల సంఖ్య 2,90,630కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,240గా ఉంది. వారిలో 828 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 28 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే,
రాష్ట్రవ్యాప్తంగా పల్స్పోలియో కార్యక్రమం ఆదివారం కొనసాగుతోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా నేపథ్యంలో అన్ని కేంద్రాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. వైద్యులు, సిబ్బందికి కావాల్సిన సర్జికల్ మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు, డిస్పోజబుల్ గ్లౌజులు సరఫరా చేశామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 0-5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులు 38,31,907 మంది ఉన్నారని, వీరందరికీ పోలియో చుక్కలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు