తెలంగాణలో కరోనా: 80%లక్షణాల్లేవు -ఒకేరోజు 59మంది మృతి -కొత్తగా 6,876 కేసులు -వెంటిలేటర్ అంబులెన్స్ కొరత
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్లే తగ్గి మళ్లీ ఉధృతమైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం నాటి బులిటెన్ లో కొత్త కేసులు 5వేలోపు, మరణాలు 50లోపు నమోదుకాగా, మంగళవారం నాటి లెక్కల్లో భారీ పెరుగుదల కనిపించింది. రాష్ట్రంలో నమోదవుతోన్న కొవిడ్ పాజిటివ్ కేసుల్లో 75 నుంచి 80 శాతం కేసులు అసింప్టమాటింగ్(లక్షణాలేవీ లేకుండానే కొవిడ్ వ్యాధి)గా ఉన్నాయని అధికారులు చెప్పారు.
వైద్య శాఖ తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 70,961 శాంపిల్స్ ను పరీక్షించగా, కొత్తగా 6,876 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 4,63,361కు పెరిగింది. నిన్న ఒక్కరోజే కరోనా కాటుకు 59 మంది బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 2476కు పెరిగింది. తెలంగాణలో మరణాల రేటు 0.53 శాతంగా ఉంది.
నిన్న ఒక్కరోజే కొవిడ్ వ్యాధి నుంచి 7,432 మంది కోలుకున్నారు. తద్వారా రికవరీల సంఖ్య 3,81,365కు పెరిగింది. కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 82.30 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 79,520 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో కొంతమంది హోంఐసోలేషన్లో చికిత్స పొందుతుండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,029 కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 502, ఆదిలాబాద్ 113, భద్రాద్రి కొత్తగూడెం 121, జగిత్యాల 211, కామారెడ్డి 118, కరీంనగర్ 264, ఖమ్మం 235, మహబూబ్నగర్ 229, మహబూబాబాద్ 133, మంచిర్యాల 188, నాగర్ కర్నూల్ 190, నల్గొండ 402, నిజామాబాద్ 218, పెద్దపల్లి 218, రాజన్న సిరిసిల్ల 107, రంగారెడ్డి జిల్లాలో 387, సంగారెడ్డి 157, సిద్దిపేట్ 258, సూర్యాపేట్ 372, వికారాబాద్ 171, వనపర్తి 123, వరంగల్ రూరల్ 109, వరంగల్ అర్బన్ 354, యాదాద్రి భువనగిరి జిల్లాలో183 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే
కరోనా సెకెండ్ వేవ్ విజృంభిస్తుండడంతో హైదరాబాద్ నగరంలో వెంటిలేటర్ అంబులెన్సుల కొరత ఏర్పడిందని, ప్రైవేటులో అంతంత మాత్రంగా లభ్యత ఉన్నా, పది కిలోమీటర్ల పరిధిలో ఒక వెంటిలేటర్ అంబులెన్స్ను బుక్ చేయాలంటే కనీసం రూ.20వేలు ఖర్చు పెట్టక తప్పడం లేదని, డబ్బులున్నా అంబులెన్స్ దొరుకుతుందో లేదో చెప్పలేని పరిస్థితి ఉందని మీడియాలో రిపోర్టులు వచ్చాయి.












Click it and Unblock the Notifications