క్రికెట్ బెట్టింగ్లో ఘరానా బుకీ: ఎవరీ సులేమాన్ సురానీ?
హైదరాబాద్: ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నమెంట్లో టీమిండియా అద్భుతమైన విజయాలతో దూసుకుపోతుంటే, హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఇటీవల శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచ్పై భారీఎత్తున బెట్టింగ్ నడుస్తోందనే సమాచారంతో సైబరాబాద్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ రంగస్వామి బృందం దాడులు నిర్వహించింది.
ఈ దాడుల్లో నగరానికి చెందిన కలెక్షన్ ఏజెంట్లు బొజ్జ గోపాల్యాదవ్, బూపాల్ యాదవ్, ప్రశాంత్, జగన్రెడ్డి, అంజన్కుమార్, జితేంద్ర, హనుమాన్దాస్లను అరెస్టు చేసి పోలీసులు వారి వద్ద నుంచి రూ.11,12,500ల నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ దాడుల్లో ఘరానా బుకీ సులేమాన్ సురానీ తప్పించుకున్నాడు.
ఈమేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎస్వోటీ అదనపు డీసీపీ రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ ఘరానా బుకీ సులేమాన్ సురానీ తప్పించుకున్నప్పటికీ... అతడితో పాటు మరో 34మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
ఇంతకీ ఎవరీ సులేమాన్ సురానీ?
సులేమాన్ సురానీ(30) నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే ప్రధాన బుకీల్లో ఒకడు. సికింద్రాబాద్ సింధ్ కాలనీలో ఉండే ఇతడు ఐదేళ్ల క్రితం పంటర్గా బెట్టింగ్ వ్యాపారంలో అడుగుపెట్టాడు. ఇతడి తమ్ముడు రహీమ్ బెట్టింగ్ లైన్స్ నిర్వహిస్తుంటాడు. సులేమాన్ నేతృత్వంలో ప్రస్తుతం నగరవ్యాప్తంగా 10మంది కలెక్షన్ ఏజెంట్లు ఉన్నారు.
వీరంతా పంటర్ల నుంచి ఆట ప్రారంభం కాగానే డబ్బులు వసూలు చేస్తారు. పంటర్ కనీసం రూ.15వేల వరకు ప్రతినిధి(ఏజెంట్ల) వద్ద ధరావతుగా ఉంచుతారు. ఒక్కో పంటర్ సుమారు రూ.5లక్షల వరకు పందెం కాస్తుంటారు. ఇలా ఒక్క మ్యాచ్పై సుమారు రూ.5కోట్ల వరకు లావాదేవీలు నడుస్తుంటాయి.
సులేమాన్ ముఠా హైదరాబాద్ నుంచే ఢిల్లీ, ముంబై, జైపూర్, గోవా లాంటి నగరాల్లో ఫోన్ ద్వారానే బెట్టింగ్ నడిపిస్తుంటుంది. ఒకే సమయంలో వంద వరకు లైన్లు నడిపించడంలో సులేమాన్ దిట్ట. కలెక్షన్ ఏజెంట్లకు రూ.50వేల చొప్పున, లైన్లు నడిపే వారికి రూ.20వేల చొప్పున జీతంగా ఇస్తుంటాడు.
హైదరాబాద్లో సులేమాన్ ద్వారా సుమారు 150మంది వరకు పంటర్లు నిరంతరం బెట్టింగ్కు పాల్పడుతున్నారు. ఇతను తన లావాదేవీలను హవాలా రూపంలోనే చేస్తుంటాడు. బెట్టింగ్లో పెద్దమొత్తంలో ఆర్జించే సొమ్మును సులేమాన్ హవాలా మార్గంలో కాసనోవా స్థావరాలైన శ్రీలంక, గోవాల్లో డిపాజిట్ చేస్తుంటాడు.