హరీశ్ను పక్కనబెడుతున్నారా? అట్టహాసం సరే.. తెలంగాణ అధికారిక గీతమేది?
హైదరాబాద్: తన్నీరు హరీశ్ రావు రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి. 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికవ్వక ముందే వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా పని చేశారు. అంతేకాదు ప్రస్తుత సీఎం - టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వెన్నంటి ఉన్నారు. కీలక సమయంలో టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచిన హరీశ్ రావు 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. తొలి దశలో అన్ని అంశాల్లో కీలకంగా వ్యవహరించిన హరీశ్రావు.. ఇటీవల ముఖ్యమైన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
భాగ్యనగరానికి తల మానికమైన హైదరాబాద్ మెట్రో రైల్ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఔత్సాహిక ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) ప్రారంభోత్సవంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్తోపాటు ప్రదాని మోదీ పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సహా మంత్రులు హాజరు
ఎంతో ప్రతిష్ఠాత్మక కార్యక్రమం మెట్రో రైలు ప్రారంభోత్సవంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్తోపాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మొదలు మంత్రులు మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. కానీ హరీశ్ రావు మాత్రం ‘హస్తిన'లో ఉన్నారు. సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, నిధుల కేటాయింపుల గురించి మాట్లాడడానికి వెళ్లారనుకున్నారు. ఆయన ఒకింత ముభావంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. కానీ అట్టహాసంగా ఐదు రోజుల పాటు లాల్ బహదూర్ స్టేడియం వేదికగా తెలుగు ప్రపంచ మహాసభలు జరిగినా హరీశ్ రావు భాగస్వామ్యమే కనిపించలేదు.

తెలుగు మహాసభల్లో కేటీఆర్, కల్వకుంట్ల కవిత బిజీబిజీ
ఐదు రోజుల పాటు మంత్రి హరీశ్ రావు ఇప్పుడు కూడా కాళేశ్వరం తదితర సాగునీటి ప్రాజెక్టుల అనుమతుల కోసం ఢిల్లీలోనే ఉండటం ఆసక్తికర పరిణామం. కానీ ఇటు జీఈఎస్, ప్రపంచ తెలుగు మహాసభల్లో రాష్ట్ర మంత్రి కేటీ రామారావు, ఎంపీ కల్వకుంట్ల కవిత అంతా తలలో నాలుకగా మారారు. అప్పుడే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో వారసత్వాన్ని ప్రోత్సహించడానికి పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

భాషా పరిరక్షణపై జనవరిలో ప్రకటిస్తామన్న కేసీఆర్
ఇక మంగళవారం వరకు ఐదు రోజుల పాటు అట్టహాసంగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో అతిథులకు నిర్వహణ, ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వాహకులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మహాసభల్లో తెలుగు భాషను పరిరక్షించాలని సామాన్య ప్రతినిధి నుంచి ముఖ్య అతిథి వరకూ అందరూ వ్యాఖ్యానించారు. కానీ ఎలా రక్షించాలనే దానిపై స్పష్టత ఇవ్వలేకపోయారు. దీన్ని చివరి రోజు సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని అందరూ ఎంతో ఆశతో ఎదురుచూసినా, ఆ ఆశలన్నీ నీరు గారిపోయాయి. భాషాపరిరక్షణ కోసం జనవరిలో ప్రకటన చేస్తానని కేసీఆర్ ప్రకటించారు.

ఇలా భారీగా తరలి వచ్చిన తెలుగు భాషాభిమానులు..
ఈ నెల 15వ తేదీన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఎల్బీస్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు అంగరంగవైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈ మహాసభలకు 42దేశాలు, 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, 31 జిల్లాల నుంచి 16 వేల మంది అతిథులు, ప్రతినిధులు హాజరయ్యారు. ప్రారంభసభకు 40వేల మంది, ముగింపు సభకు 30 వేలమంది భాషాభిమానులు హాజరయ్యారు. ఈ రెండు రోజులు అధికార యంత్రాంగం వారందరినీ ఈ సభలకు తరలించింది. మిగిలిన మూడు రోజులు మాత్రం స్వచ్చంధంగా వేల మంది సాహితీవేత్తలు, కవులు, కళాకారులు వచ్చి సదస్సులను తిలకించారు. ఏడు వేదికల్లో వందకు పైగా సదస్సులు, 20 సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.

భాష ప్రగతి కోసం తీసుకున్న చర్యల మాటేమిటి?
మహాసభల్లో తెలుగు భాషా పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై పెద్దగా చర్చ జరగలేదు. కేవలం సీఎం కేసీఆర్ను పొగడేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. భాషాసాహిత్యాలపై పట్టు ఉన్న పండితులకు ఆహ్వానించినా వారు కూడా దిశానిర్దేశం చేయలేదు. ఎంతవరకూ మహాసభల నిర్వహణపై సీఎంని ఆకాశానికెత్తడానికే వారి పాండిత్యం ఉపయోగపడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి భాషా సాహిత్య సదస్సుల్లో మంత్రులను ముఖ్య అతి థులుగా పిలవడంపై కూడా విమర్శలొచ్చాయి. వారి స్థానంలో ప్రముఖ భాషావేత్తలను పెడితే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కవులకు ప్రాధాన్యం ఇవ్వడంలోనూ ఒక రకమైన ధోరణిని అవలంభించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తెలుగు యూనివర్సిటీ, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన ఘటనలే నిదర్శనం. చివరి రోజు కూడా ఈ వేదికలపై ఆఖరి సెషన్లో చాలా మంది కవులను సన్మానించకుండానే ముగించారు. దీంతో మరోసారి కవులు ఆందోళన బాట పట్టారు.

రాష్ట్ర గీతంపై మిగిలిన నిరాశ..
ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ సంస్కృతి, వైభవం, కళలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ముందు నుంచి ప్రభుత్వ పెద్దలు, నిర్వాహకులు పలుమార్లు ప్రకటించారు. కానీ మహాసభల్లో తెలంగాణ కళలు, సంస్కృతికి ప్రాధాన్యం కనిపించలేదు. లలిత కళావేదికలో జానపద కార్యక్రమాలు, చిందు యక్షగానం, బాగోతం, కోలాటం తదితర కార్యక్రమాలు రద్దు చేశారు. కళాసారథి కార్యక్రమానికీ కేవలం గంట మాత్రమే సమయం ఇవ్వడంతో ఆ సంస్థ చైర్మన్ రసమయి బాలకిషన్ కూడా అలకబూనారని వార్తలు వచ్చాయి. ఈ మహాసభల్లో కనీసం రాష్ట్ర గీతాన్ని ప్రకటిస్తారని ఎంతో ఆశించిన భాషాభిమానులకు, ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. సభలు ముగిసిన తర్వాత ఉపాధ్యాయులంతా మంత్రులను అడిగినా వారు నోరు మెదపలేదు.












Click it and Unblock the Notifications