సునీల్ కనుగోలు విచారణ: మల్లు రవిపై సైబర్ క్రైం కేసు నమోదు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై అభ్యంతరకర రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. మల్లు రవిని ఏ5గా నిందితుడిగా చేర్చారు. సునీల్ కనుగోలు వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశారు.
కాంగ్రెస్ వార్ ఇంఛార్జ్ మల్లు రవి అని సునీల్ కనుగోలు చెప్పడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా, రెండ్రోజుల క్రితమే మల్లు రవికి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. తాజాగా, సీసీఎస్ విచారణకు హాజరైన మల్లు రవి.. నిర్దేశించిన తేదీలోనే రావాలని సైబర్ క్రైం పోలీసులు వెనక్కి పంపించారు. గురువారంనాడు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

తెలంగాణ గళం పేరిట వీడియోలు పోస్టు చేశారన్న ఆరోపణలపై సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలును విచారిస్తున్నారు. మొదటగా డిసెంబర్ 14న కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు.. మాదాపూర్లోని సునీల్ కనుగోలు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు.
సునీల్ కనుగోలును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతున్నారు. హైకోర్టు సూచనల మేరకు సునీల్ కనుగోలు బుధవారం విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియా పోస్టులపై ఆయనను ప్రశ్నించారు. లభ్యమైన సమాచారంపై ప్రశ్నలు అడిగారు. దాదాపు రెండు గంటలపాటు సునీల్ కనుగోలును పోలీసులు విచారించారు. సునీల్ విచారణ ముగిసిన గంటల వ్యవధిలోనే మల్లు రవిపై కేసు నమోదు చేశారు. సునీల్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే మల్లు రవిపై కేసు నమోదు చేశారు సైబర్ క్రైం పోలీసులు.












Click it and Unblock the Notifications