cyber crimes: తక్కువ ధరలకే క్వాలిటీ వస్తువులు.. ఆకట్టుకుంటున్న ఫేక్ సైట్లు; తస్మాత్ జాగ్రత్త!!
ఆన్లైన్లో అతి తక్కువ ధరలకే విలువైన వస్తువులు వస్తున్నాయంటే చూసి టెంప్ట్ అవుతున్నారా? కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? వెయ్యి రూపాయల విలువ ఉండే వస్తువును 100 రూపాయలకే ఇస్తారు అంటే నమ్ముతున్నారా? అయితే ఖచ్చితంగా మోసపోతారు అని హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.
తక్కువ ధరలకే వస్తువులు.. ఆకట్టుకునే ఫేక్ ఆన్ లైన్ సైట్లు
మొబైల్ ఫోన్ ఓపెన్ చేయగానే బోలెడన్ని ఆన్లైన్ సైట్ లు మనకు కావలసిన నిత్యావసర వస్తువులు, గృహాలంకరణ వస్తువులతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. చాలా క్వాలిటీ, మంచి డిజైన్లు ఉన్న అనేక గృహోపకరణాలను విక్రయించే సైట్లలా, వెయ్యి రూపాయల ధర ఉండే వస్తువును 100 రూపాయలకే అంటూ వినియోగదారులను ఆకర్షిస్తాయి. అతి తక్కువ ధరకు, మంచి వస్తువు దొరుకుతుంది అన్న సంతోషంలో ఉండే వినియోగదారులు, ఆ వెబ్ సైట్ ఏమిటి? అందులో నిజంగా వ్యాపారం జరుగుతుందా లేదా? ఆ సైట్లో మనం వస్తువులను కొనుగోలు చేయవచ్చా లేదా? అనే అంశాలను వేటినీ పరిగణలోకి తీసుకోకుండా ఆర్డర్ పెడతారు.
సైట్లలో కొనుగోలు తర్వాత మోసపోయామని గుర్తిస్తున్న వినియోగదారులు
ఇక సదరు సైట్లలో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉండదు. దీంతో ముందే నగదు చెల్లించి వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత ఆ సైటులో మనం కొనుగోలు చేసినట్టు ఎటువంటి ఆధారమూ ఉండదు. కొనుగోలు చేసిన వస్తువు ఇంటికి రాదు. దీంతో మోసపోయామని లబోదిబోమంటున్న వినియోగదారులు ఎంతోమంది ఉన్నారు. చిన్న చిన్ననగదు మొత్తాలు మోసపోయినవారు తిట్టుకుని ఊరుకుంటారు. ఇక పెద్ద మొత్తంలో మోసపోతేనే వ్యవహారం పోలీస్ స్టేషన్ దాకా వేస్తుంది.
ఆన్ లైన్ సైట్ల విషయంలో జాగ్రత్త .. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటేనే కొనండి
అందుకే ఇటువంటి మోసాల బారిన పడకుండా ఆన్లైన్ సైట్ల విషయంలో జాగ్రత్తలు వహించాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్న సైట్లలో వస్తువులు కొనుగోలు చేయకుండా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు. ఒకవేళ కొనుగోలు చేసినా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటేనే, వస్తువు మీ చేతికి వచ్చిన తర్వాతే డబ్బు చెల్లించేలా కొనుగోలు చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అలా కాకుండా ఏ సైట్ పడితే ఆ సైట్ ను నమ్మి డబ్బు చెల్లించి వస్తువులను కొనుగోలు చేయడం వల్ల మొదటికే మోసం వస్తుందని చెబుతున్నారు.
విలువైన వస్తువులను మరీ తక్కువ ధరకు ఇవ్వరు.. అలా ఇస్తామంటే మోసమని నమ్మండి
ఇదే సమయంలో వినియోగదారులకు ఒక ముఖ్యమైన విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పుడూ విలువైన వస్తువులను, వాటి ధరను అత్యంత గరిష్ఠంగా తగ్గించి విక్రయించబోరని, అలా విక్రయిస్తున్నట్టు పెడుతున్న ఈ కామర్స్ సైట్ల విషయంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.
అవన్నీ ఫేక్ ఈ కామర్స్ సైట్లని హెచ్చరిస్తున్నారు. ఆయా సైట్లలో వస్తువులను కొనుగోలు చేసేవారు, గతంలో కొనుగోలు చేసిన వారి అభిప్రాయాలను రివ్యూల రూపంలో ముందు చూడాలని సూచిస్తున్నారు. అలా ఎలాంటి రివ్యూలు కనిపించకున్నా అనుమానించాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత ఆయా సైట్ లు మంచివి అని భావిస్తే వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చని, లేదంటే అటువంటి సైట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.