ఇలాంటి వ్యాఖ్యలా?, కాంగ్రెస్ నాశనమే: డిగ్గీపై డీఎస్ తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్పై టీఆర్ఎస్ ఎంపీ డీ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రెండు సార్లు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. ఇప్పటికే డిగ్గీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్, డీజీపీ అనురాగ్ శర్మ ఘాటుగానే స్పందించారు.
తాజాగా, డీఎస్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు ఆయన బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. సున్నితమైన అంశంపై ఇలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. ప్రభుత్వం, పోలీసులపై నిరాధార ఆరోపణలు చేయడం తగదన్నారు. తెలంగాణ పోలీసులు బోగస్ సైట్లతో ముస్లిం యువతను ఐఎస్ ఉగ్రవాదులుగా మారేందుకు ప్రోత్సహిస్తున్నారనడం దిగ్విజయ్ సింగ్ తెలివితక్కువ తనానికి నిదర్శనమని అన్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు డీఎస్ తెలిపారు.
తెలంగాణ పోలీసుపై తగ్గని డిగ్గీ: క్షమాపణకు వెంకయ్య డిమాండ్, మాగంటి ఫిర్యాదు
భద్రతా పరమైన విషయాల్లో ఓ బాధ్యత కలిగిన వ్యక్తి మాట్లాడేది ఇలానేనా? అంటూ నిలదీశారు. దిగ్విజయ్ సింగ్కు రోజుకో కాంట్రావర్సీతో వార్తల్లో ఉండటం అలవాటేనని, ఇప్పుడు భద్రతా పరమైన అంశంలో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం యువతను తెలంగాణ ప్రభుత్వం ప్రలోభాలకు గురిచేస్తుందని అసత్య ఆరోపణలు చేయడం తగదని అన్నారు. సీఎం కేసీఆర్ మైనార్టీల పట్ల వ్యవహరిస్తున్న తీరు ప్రపంచానికి తెలుసునని అన్నారు.
రోజుకో మాట మాట్లాడటం దిగ్విజయ్ సింగ్కు కొత్తేం కాదని దుయ్యబట్టారు. దేశంలోనే తెలంగాణ పోలీసులకు మంచి పేరుందని అన్నారు. దీన్ని డిగ్గీ ఓర్వలేకపోతున్నారని అన్నారు. తెలంగాణ పోలీసుల ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీసేలా దిగ్విజయ్ వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్ర పేలుళ్లు జరగకుండా తెలంగాణ పోలీసులు ఇతర రాష్ట్రాల పోలీసులకు సహాయ సహకారాలు అందించారన్నారు.
దిగ్విజయ్ సింగ్ వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ అని డీఎస్ అన్నారు. డిగ్గీ కాంగ్రెస్ ఇంఛార్జీగా ఎక్కడ ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి నష్టమేనని అన్నారు. తెలంగాణ పోలీసులు, ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేసిన దిగ్విజయ్ సింగ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
దిగ్విజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్, డీజీపీ అనురాగ్ శర్మలు ఇప్పటికే స్పందించారని అన్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై కేంద్రం తీవ్రంగా స్పందించాలని, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆయనపై చర్యలు తీసుకోవాలని డీఎస్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం కూడా డిగ్గీపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దేశంలో ఉన్న మంచి వాతావరణాన్ని డిగ్గీ ఇలాంటి వ్యాఖ్యలతో చెడగొడుతున్నారని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దయనీయంగా ఉందని, డిగ్గీలాంటి వ్యక్తులతో ఆ పార్టీ నాశనమేనని అన్నారు.
చర్యలు తీసుకుంటాం: నాయిని
తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని మంత్రి నాయిని డిమాండ్ చేశారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై ఇప్పటికే తమ శాసనసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.