దళితబంధు పెద్ద దగా.. కేసీఆర్పై పోటీకి సిద్ధం.. ఈటల సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం కేసీఆర్పై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరో సారి విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణకు సీఎంగా ఉండడం అరిష్టమని విమర్శించారు. రాష్ట్రంలోని భూములపై అజమాయిషి కోసమే ధరణి తీసుకువచ్చారని ఆరోపించారు. దళితబంధు పెద్ద దగా, దీనిని కేవలం ఓట్ల కోసమే కేసీఆర్ తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళితుల ఆత్మగౌరవానికి ఖరీదు కట్టిన కేసీఆర్
హైదరాబాద్లో తెలంగాణ జర్నలిస్లు యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ద ప్రెస్ లో మాజీ మంత్రి , బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. దళితులను సీఎం కేసీఆర్ అడుగడుగునా మోసం చేస్తున్నారని మండిపడ్డారు . దళితులపై ఆయనకు ప్రేమలేదని విమర్శించారు. కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తనను ఓడించేందుకే అప్పటి కప్పుడు దళితబంధు పథకం తీసుకువచ్చారని ఆరోపించారు. దళితుల ఆత్మగౌరవానికి ఖరీదు కట్టారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామన్న సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఇవ్వలేదని మండిపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో కేసీఆర్ ఆహంకారం దిగివచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫామ్హౌస్ నుంచి జనంలోకి వచ్చారని ఈటల పేర్కొన్నారు.

ప్రగతిభవన్ వద్ద అవమానం
తాను మంత్రిగా ఉన్నప్పుడు తనతో పాటు టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ను కలిసేందుకు ప్రగతిభవన్కు వెళ్తే కనీసం లోపలికి కూడా రానివ్వలేదని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడే తమ ఆత్మగౌరవం దెబ్బతిందని , చాలా బాధపడ్డామని తెలిపారు. ఆసమయంలో తనతో పాటు వచ్చిన టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ వద్ద బానిసత్వం అనుభవిస్తున్నాం అన్నా అని అన్నట్లు ఈటల గుర్తు చేశారు. మంత్రి వర్గ సమావేశాని ముందే కేసీఆర్ నిర్ణయాలు తీసుకునే వారని పేర్కొన్నారు.

కేసీఆర్పై పోటీకి సిద్ధం..
వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఈటల ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీలో వర్గ విభేదాలు లేవని ఒక్కతాటిపై నాయకులంతా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రజలు నమ్మెపరిస్థితి లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందని విమర్శించారు. హుజూరాబాద్ నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని పేర్కొన్నారు. తమ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సీఎం కేసీఆర్పై పోటీకి సిద్ధమన్నారు.

హుజూరాబాద్లో రూ 600 కోర్టు ఖర్చు..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఒక రాజకీయ పార్టీతోనే సాధ్యమని అందుకే నాడు టీఆర్ఎస్ పార్టీని పెట్టారన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసమే నాడు కేసీఆర్తో కలిసి పనిచేశానని చెప్పారు. తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నానని ఆనందం వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖ మంత్రిగా కరోనా మహమ్మారి సమయంలో ఎంతో కష్టపడి పనిచేశానని అన్నారు. ఇంతటి సంక్షోభంతో టీఆర్ఎస్ నుంచి తనును బయటకు పంపారని ఈటల పేర్కొన్నారు. హుజూరాబాద్లో తనను ఓడించేందుకు రూ 600 కోట్లకు పైగా డబ్బును కేసీఆర్ ఖర్చుచేశారని చెప్పారు.

రైతుబంధు నగదు కేసీఆర్ ఇంట్లోవా..?
తెలంగాణ రైతుల కూలీలను, కౌలు దారులను సీఎం కేసీఆర్ విస్మరించారని మండిపడ్డారు ఈటల. రైతుబంధు డబ్బులు కేసీఆర్ ఇంట్లో నుంచి ఇవ్వడంలేదని , అవి ప్రజల చెమట నుంచి వచ్చినవన్నారు. ఉద్యమ కారులకు టీఆర్ఎస్ పార్టీలో చోటు లేదని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డల రక్తం చూసిన వ్యక్తులకు పదవులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో భూములపై అజమాయిషీ కోసమే ధరణి తీసుకువచ్చారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆసంతృప్తితో
రగలిపోతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ని దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని దుయ్యబట్టారు ఈటల.












Click it and Unblock the Notifications