చెప్పుడు మాటల వల్లే ఈ దుస్థితి, రహస్య పరిశీలకులు అవసరం: దానం
హైదరాబాద్: చెప్పుడు మాటల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా మారిందని మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ ఆరోపించారు. వాస్తవాలను తెలుసుకునేందుకు జిల్లాకో రహస్య పరిశీలకుడిని నియమించాలని త్వరలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి కోరనున్నట్లు తెలిపారు.
తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలు నిరాధారమని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. కొందరు కావాలని ఇటువంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పిసిసి చీఫ్ డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఆయన తెలంగాణ రాష్ట్రసమితి పార్టీలో జులై 8న చేరతున్నట్లు తెలిపారు. అంతేగాక, తన వెంట మరికొందరు నేతలు కూడా వస్తున్నారని చెప్పారు. దీంతో డిఎస్ తోపాటు దానం నాగేందర్ కూడా పార్టీ మారుతున్నట్లు ఊహాగానాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో తాను కాంగ్రెస్ పార్టీని వీడటం లేదని దానం నాగేందర్ స్పష్టం చేశారు. కాగా, డి శ్రీనివాస్కు టిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సీటు లేదా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టే అవకాశాలున్నాయని వార్తలు వినవస్తున్నాయి.