ప్లాన్ ప్రకారమే అసదుద్దీన్ను పంపించారు: శ్రవణ్, అర్డినెన్స్పై ఫైర్
హైదరాబాద్: మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేయకుండా ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ పంపినట్లు లీక్లు ఇవ్వడంలో పోలీసుల పాత్ర లేదా కాంగ్రెసు నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. అసద్ను అరెస్ట్ చేయాల్సి వస్తుందనే భయంతోనే ఇలా చేశారని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు కూడా మజ్లిస్ అంటే భయపడుతున్నట్లున్నారని ఆయన అన్నారు.
టీఆర్ఎస్, ఎంఐఎం, పోలీసులు ములాఖత్ అయ్యారనడానికి ఇంతకన్నా ఉదాహరణ మరోటి అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్ సీఎం అని ప్రచారం చేసుకుంటున్న కేటీఆర్ పాతబస్తీ ఘటనపై సరైన రీతిలో స్పందించకుండా ఎన్నికల వేళ ఇలాంటివి సహజమని వ్యాఖ్యానించడం సిగ్గుచేటని అన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా అసదుద్దీన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పరిస్థితిని గమనించి గవర్నర్ చక్కదిద్దాలని, సెక్షన 8 తన చేతిలో ఉన్న విషయాన్ని మర్చిపోవద్దని దాసోజు కోరారు.

కోర్టు పరిశీలనలో ఉన్న జీవో 207ను కోర్టు అనుమతి లేకుండా ప్రభుత్వం ఎలా రద్దు చేస్తుందని శ్రవణ్కుమార్ ప్రశ్నించారు. కోర్టు పరిశీలనలో ఉన్న అంశంపై గవర్నర్ నరసింహన్ ఇంత హడావుడిగా ఆర్డినెన్సను జారీ చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. జీవో 207ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిపై వాదోపవాదాలు జరుగుతుండగానే ప్రభుత్వం గురువారం రాత్రి ఆర్డినెన్స్ జారీ చేయడంతో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
అడ్వొకేట్ జనరల్ హైకోర్టును తప్పుదోవ పట్టించారని, రెండు వాయిదాలు కోరారని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వంతో కుమ్మక్కై జీవో 207పై ఆర్డినెన్సను తీసుకొచ్చారని, దాంతో, ప్రభుత్వాన్ని సమర్థిస్తూ కోర్టులో ఏజీ చేసిన వాదనలన్నీ శుద్ధ అబద్ధాలని తేలిపోయిందని అన్నారు. జీవో నెంబరు 207ను తీసుకు రావడం కంటే మరింత పెద్ద మోసానికి, నేరానికి ప్రభుత్వం పాల్పడిందని శ్రావణ్ తప్పుబట్టారు.
ప్రభుత్వం దొడ్డిదారిన ఆర్డినెన్స్ తెచ్చిందని, టీఆర్ఎస్ పిరికితనం దీనితో తేటతెల్లమవుతోందని విమర్శించారు. గవర్నర్ వ్యవహార శైలి కూడా అనుమానాస్పదంగా ఉందని, కేసు హైకోర్టులో విచారణలో ఉండగా ఇంత హడావుడిగా ఆయన ఆర్డినెన్స్ ను ఎలా జారీ చేస్తారని దాసోజు ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన నేరాన్ని ఆయన చట్టబద్ధం చేశారని తప్పుబట్టారు.
ఎమ్మెల్సీలను ఎక్స్ అఫీషియోలుగా తీసుకు రావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఆర్డినెన్స జారీ చేయడం ప్రజాస్వామ్యానికి మరో బ్లాక్ డే అని, రాజ్యాంగం అంటే, ప్రజాస్వామ్య విలువలు అంటే టీఆర్ఎస్కు, ఏజీకి, గవర్నర్కు ఏమాత్రం గౌరవం లేదని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications