టిఆర్ఎస్పై దత్తాత్రేయ విసుగు, కెసిఆర్ని ప్రశ్నించిన సిబిఐ.. ఆయుధం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ బుధవారం నాడు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని ధ్వజమెత్తారు.
వరంగల్ ఉప ఎన్నికల్లో బిజెపి-టిడిపి కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశలను వమ్ము చేసిందన్నారు. అన్ని రంగాల్లోను తెలంగాణ సర్కార్ విఫలమైందని దుయ్యబట్టారు. రైతు ఆత్మహత్యల పైన అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించవలసి ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేత కావడం లేదన్నారు. కేంద్రం అన్ని రంగాల్లో సహకరిస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వైఫల్యాలను తాము ప్రజలలోకి తీసుకు వెళ్తామని దత్తాత్రేయ చెప్పారు.

టిఆర్ఎస్ పాలన పైన ప్రజలు విసుగు చెందారన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలో తమను వరంగల్ ఉప ఎన్నికల్లో గెలిపిస్తాయని చెప్పారు. ఆయన బుధవారం వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగిన టిడిపి - బిజెపి కార్యకర్తల సమన్వయ సమావేశానికి హాజరయ్యారు.
మరోవైపు, ఉప ఎన్నికల నేపథ్యంలో విపక్షాలు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ను సిబిఐని ప్రశ్నించిన అంశాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాయి. తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకే కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేపట్టారని ఆరోపించారు. కేసీఆర్ తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఈఎస్ఐలో జరిగిన అవినీతిపై సీబీఐ ప్రశ్నిస్తే ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. అవినీతికి పాల్పడితే కొడుకు, కుమార్తెను కూడా సహించబోనన్న కేసీఆర్... ఆయనను సీబీఐ విచారణ చేయడంపై మౌనం వీడి సమాధానం చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications