కరోనాపై పోరు: కేసీఆర్ జోరు -వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి సీఎం -కెప్టెన్ ఇంట్లో లంచ్
'కరోనాకు భయపడి జనాన్ని గాలికొదిలేసి ఫామ్ హౌజ్ కు పారిపోయాడు.. ', 'కొవిడ్ బారినపడి ప్రజలు విలవిల్లాడుతోంటే సీఎం కేసీఆర్ ఎక్కడున్నాడు, వేర్ ఈజీ కేసీఆర్..', 'కరోనా వేళ అత్యధిక సమయం ఫామ్ హౌజ్ లో క్వారంటైన్ లో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్..'.. ఇలా ఒకటా రెండా, గడిచిన 14 నెలలుగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఎన్నెన్నో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఆయన మాత్రం మాటల కంటే చేతలకే ప్రాధాన్యమిస్తూ తన పనితాను చేసుకుపోయారు. రెండో దశలో ప్రమాదకర వేరియట్లు విజృంభిస్తున్న సమయంలో ప్రజలకు భరోసా ఇచ్చేందుకు నేరుగా రంగంలోకి దిగారు..
కరోనాపై పోరులో సీఎం కేసీఆర్ జోరు పెంచారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడేళ్లలో తొలిసారిగా బుధవారం నాడు హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించి అందరినీ ఆశ్చర్యంలో ముంచేసిన ఆయన ఇప్పుడు వరంగల్ లోని ప్రఖ్యాత ఎంజీఎం ఆస్పత్రికీ వెళ్లనున్నారు. సీఎం వరంగల్ పర్యటనకు సంబంధించి సీఎంవో, టీఆర్ఎస్ వర్గాలు అందించిన కీలక సమాచారం ఇలా ఉంది..
సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు వరంగల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో వరంగల్ పర్యటనకు బయల్దేరనున్న ఆయన.. ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, సుబేదారికి హెలికాప్టర్లో చేరుకుంటారు. అక్కడినుంచి రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మికాంతరావు ఇంటికి వెళ్లి కాసేపు విశ్రాంతి అనంతరం సెంట్రల్ జైలును సందర్శిస్తారు. కెప్టెన్ ఇంట్లోనే మధ్యాహ్నం లంచ్ చేసిన అనంతరం..
వరంగల్ సిటీలోని ప్రఖ్యాత ఎంజీఎం ఆస్పత్రిని సీఎం కేసీఆర్ సందర్శిస్తారు. గాంధీ ఆస్పత్రిలో చేసినట్లుగానే వరంగల్ ఎంజీఎంలోనూ కొవిడ్ రోగులను సీఎం పరామర్శించి మాట్లాడనున్నారు. ఇక్కడి నుంచి తిరిగి కెప్టెన్ ఇంటికి చేరుకుని కాసేపు విశ్రాంతి అనంతరం లిపాడ్ వద్దకు చేరుకుని హైదరాబాద్కు తిరుగుపయనం అవుతారు.
Recommended Video
తెలంగాణలో లాక్ డౌన్ ఫలిస్తోందనడానికి నిదర్శనంగా రోజువారీ కేసులు, మరణాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం వెలువరించిన బులిటెన్ ప్రకారం కొత్తగా 3,660 పాజిటివ్ కేసులు, 23 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,44,263కు, మరణాల సంఖ్య 3060కి పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 45,757 యాక్టివ్ కేసులున్నాయి.