బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులు: హిస్టరీ రిపీట్ అవుతుందన్న కేటీఆర్, బన్నీ డైలాగ్తో కాంగ్రెస్ కౌంటర్!!
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతున్నాయి. అసలే గత అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం పాలై, తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల తర్వాత మరింత దారుణ పరిస్థితిని చూస్తోంది. లోక్సభ ఎన్నికలలో కనీసం ఒక స్థానాన్ని కూడా బిఆర్ఎస్ దక్కించుకోకపోవడం వల్ల బిఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు వలసల బాట పట్టారు.
బీఆర్ఎస్ నుండి ఆగని ఫిరాయింపులు
ప్రధానంగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బిఆర్ఎస్ నేతలు పరుగులు పెడుతున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు వంటి వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా, తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఫిరాయింపులపై కేటీఆర్ షాకింగ్ ట్వీట్
ఇక వరుసగా పార్టీలో ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చి వెళుతున్న క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.ఆ ట్వీట్ లో కేటీఆర్ అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు. 2004- 2006 లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎదుర్కొన్నామని పేర్కొన్నారు.
హిస్టరీ రిపీట్ అవుతుందన్న కేటీఆర్ పై సెటైర్లు
అప్పుడు తెలంగాణ ప్రజలు తీవ్రంగా స్పందించి ఆందోళన ఉదృతం చేయడంతో చివరికి కాంగ్రెస్ తలవంచాల్సి వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. చరిత్ర మరోసారి పునరావృతం అవుతుందంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక కేటీఆర్ చేసిన పోస్ట్ పైన నెట్టింట రకరకాల స్పందనలు వినిపిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకోలేదా అని ప్రశ్నిస్తున్నారు.
అల్లు అర్జున్ డైలాగ్ తో కేటీఆర్ కు కౌంటర్
అవును మీరు చెప్పినట్టు చరిత్ర పునరావృతం అవుతుందని అది మీ విషయంలోనే జరుగుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే బన్నీ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి అని ఒక డైలాగ్ పెట్టి కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడడం కరెక్ట్ కాదు సార్ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
కొనసాగుతున్న సోషల్ మీడియా వార్
ఎవరు చేసింది వారే అనుభవించాలంటూ మీరు చేసిన కర్మఫలం మీరే అనుభవించక తప్పదని కాంగ్రెస్ నేతలు కేటీఆర్ కు కౌంటర్ వేస్తున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో పిరాయింపుల వ్యవహారం అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణంగా మారింది.












Click it and Unblock the Notifications