డీఫాల్ట్ బెయిల్ కావాలన్న కవిత
K Kavitha: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కష్టాలు తీరట్లేదు. ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్పై విచారణ వాయిదా పడింది. సీబీఐ కేసులో ఆమె ఈ పిటీషన్ దాఖలు చేసుకున్నారు.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత బెయిల్ పిటీషన్ ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టులో విచారణకు వచ్చింది.

సీబీఐ కేసులో డీఫాల్ట్ బెయిల్ కావాలంటూ ఆమె పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను చేపట్టింది రోస్ అవెన్యూ కోర్టు. జస్టిస్ కావేరి బవేజా- దీనిపై విచారణ చేపట్టారు. వాదోపవాదాలను ఆలకించారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, బెయిల్ మంజూరు చేయడం సరికాదంటూ సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు.
వాదోపవాదాలను ఆలకించిన అనంతరం రోస్ అవెన్యూ కోర్టు.. కవిత బెయిల్ పిటీషన్ను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. ఇదివరకు సీబీఐ కేసులోనే ఆమెకు విధించిన జ్యుడీషియల్ కస్టడీని ఇదే న్యాయస్థానం పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నెల 18వ తేదీ వరకు కస్టడీలో ఉండాలని ఆదేశించింది.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు కవిత. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. తీహార్ జైలులో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఇదే కేసులో సీబీఐ అధికారులు సైతం కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications