హైదరాబాద్లో ఇలాగే కూల్చేయండి: కేసీఆర్, కేటీఆర్కు అధికారుల ఝలక్?
హైదరాబాద్: భాగ్యనగరంలో కూల్చివేతలు, ఇతర కార్యక్రమాల పైన ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. కూల్చివేతల పైన ఇక ముందు కూడా ఇదే దూకుడు ప్రదర్శించాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు.
పదిపన్నెండేళ్లు సమష్టిగా కృషి చేస్తేనే హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుందన్నారు. హైదరాబాద్ చుట్టూ రైతుల భాగస్వామ్యంతో టౌన్ షిపస్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిలు రూపొందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. హైదరాబాదులో అత్యవసరంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
రెండు రోజుల్లో 400 అక్రమ కట్టడాలు కూల్చివేసినట్లు అధికారులు సీఎం కేసీఆర్కు వివరించారు. అక్రమ కట్టడాల కూల్చివేతలో ఇదే వేగం చూపడంతో పాటు, రోడ్ల అభివృద్ధి చేపట్టాలన్నారు. ఇతర మౌలిక సదుపాయాల కల్పన సమాంతరంగా చేపట్టాలన్నారు. నగరాభివృద్ధికి బ్యాంకర్ల ఆర్థికసాయం తీసుకొని ప్రణాళికలు రూపొందించాలన్నారు.
మూడో రోజు దూకుడు తగ్గిందా, కేటీఆర్ ఆదేశాలు బుట్టదాఖలు?
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నగరం నీట మునిగిన విషయం తెలిసిందే. దీంతో నాలాలు, అక్రమ కట్టడాలని జీహెచ్ఎంసీ రెండు రోజులుగా కూల్చివేస్తోంది. అయితే మూడో రోజు కూల్చివేతల్లో కొంత దూకుడు తగ్గిందనే వాదనలు వినిపించాయి.
నగరంలోని బంజారా లేక్ ప్రాంతంలో 15 అక్రమ భవనాలను మొదట గుర్తించారు. ఇందుకు సంబంధించి కూల్చివేతల కోసం రెడ్ మార్క్ కూడా వేశారు. జేసీబీలు తెప్పించారు. అంతలోనే.. గంటల్లో అంతా మారింది.
అందులో కొన్ని భవనాలు అక్రమమనే రెవెన్యూ లెక్కలు తప్పని, నాలా కబ్జా చేయలేదని అధికారులు తేల్చారు. తద్వారా బడా బాబుల ఇళ్లు కూల్చివేసేందుకు ఏదో జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ ఆదేశాలను అధికారులు బుట్ట దాఖలు చేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఎవరికి తలొగ్గకుండా అక్రమ భవనాలు కూల్చివేయాలని కేటీఆర్ ఆదేశించారు.