నోట్ల రద్దు: హైదరాబాద్లో రూ.12 లక్షల కొత్త 2వేల నోట్లు సీజ్
హైదరాబాద్ పోలీసులు శనివారంనాడు నలుగురు యువకులను అరెస్టు చేశారు. లెక్కలేని రూ.12 లక్షల మొత్తాన్ని వారి వద్ద పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్: హైదరాబాద్ పోలీసులు శనివారంనాడు నలుగురు యువకులను అరెస్టు చేశారు. లెక్కలేని రూ.12 లక్షల మొత్తాన్ని వారి వద్ద పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం డబ్బంతా కొత్త రూ.2 వేల నోట్లు కావడం గమనార్హం. వీటికి సంబంధించిన పత్రాలు వారి వద్ద లేవు.
పంజాగుట్ట పోలీసులు వీరిని అరెస్టు చేశారు. పోలీసులు వారి వద్ద నుంచి రూ.12 లక్షలతో పాటు మొబైల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేస్తున్నారు.
సూర్యాపేటలో..
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రంగా నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్న రెండు వేర్వేరు ముఠాలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ ముఠాల నుంచి రూ. 10లక్షల విలువైన కొత్త 2వేల నోట్ల కట్టలను, రెండు కార్లను స్వాధీనం చేసుకొని తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
ప్రకాశం జిల్లాకు చెందిన ఆరుగురు వ్యక్తులు పదిహేను శాతం కమిషన్పై నోట్లను మార్పిడి చేసి ఇస్తామని నల్లధనం ఉన్నవారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు సూర్యాపేట కొత్త బస్టాండు సమీపంలోని శుక్రవారం మధ్యాహ్నం రాజధాని టీస్టాల్ ఎదుట వేచి ఉన్నారు.
దీనిపై ముందస్తు సమాచారం మేరకు దాడి చేసి ఆరుగురు నిందితులతో పాటు రూ.ఐదు లక్షల కొత్త కరెన్సీ, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా శనివారం ఉదయం మరో ముగ్గురు నిందితులు ఇదే తరహాలో కొత్త బస్టాండు సమీపంలో నోట్లు మార్పిడికి ప్రయత్నించగా వారి వద్దనుంచి రూ.5 లక్షల కొత్త కరెన్సీ, ఇండికా కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలకు చెందిన వారు.