బడ్జెట్ లో కొత్త పథకాలు: వీరికి భారీగా లబ్ది - అమలు ముహూర్తం..!!
తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ లో కొత్త పథకాలను ప్రకటించింది. సంక్షేమ రంగానికి అధిక మొత్తం లో నిధులు కేటాయించారు. కొత్తగా ప్రతీ కుటుంబానికి రూ 5 లక్షల భీమా సదుపాయం కల్పించే లా నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా కొత్తగా రానున్న ఆర్దిక సంవత్సరంలో రెండు లక్షల మేర కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారు. ఇక.. విద్యార్ధుల కోసం బడ్జెట్ లో రెండు పథకాలను భట్టి ప్రకటించారు. వీటి అమలు పైనా స్పష్టత ఇచ్చారు.
తెలంగాణ బడ్జెట్ 2026-27 లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొత్త పథకాలను ప్రకటించారు. కొత్తగా రాష్ట్రంలోని అందరికీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు కు నిర్ణయించారు. దీని ద్వారా రాష్ట్రంలోని 1 కోటి 15 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా పథకం కింద భరోసా లభిస్తుంది. జూన్, 02, 2026 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ పథకానికి బడ్జెట్లో రూ.4 వేల కోట్ల మేర కేటాయింపు చూపించారు.

అదే విధంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించి, నాణ్యమైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, డిజిటల్ సదుపాయాలతో ప్రత్యేక రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేసి అన్ని వనరులతో కూడిన తెలగాణ పబ్లిక్ స్కూళ్లుగా మార్పు చేయాలని భావిస్తున్నట్లు భట్టి బడ్డెట్ ప్రసంగంలో వెల్లడించారు. ప్రీ ప్రైమరీ నుంచి 12 వ తరగతి వరకు 1500 మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తామన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఇకపై నూతనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించనున్నారు.
బడ్జెట్ లో ప్రకటించిన భట్టి
అదే విధంగా జూన్ లో ప్రారంభం కానున్న కొత్త విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అందించనున్నారు. ఈ బ్రేక్ఫాస్ట్లో ప్రతి విద్యార్థికి వారానికి మూడు రోజులు పాలు, మిగతా మూడు రోజులు రాగి జావ అందిస్తారు. ఇక, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతినెల రూ. 2 వేల స్కాలర్షిప్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ దాదాపు 23 లక్షల 51 వేల మందికి నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని అందించనున్నారు. ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు భట్టి తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 1.20 కోట్ల ప్రమాద బీమా వర్తించనుంది.












Click it and Unblock the Notifications