పవన్ని బ్లేమ్ చేయొద్దు, తప్పు చేశా, ఐ లవ్యూ, సారీ: సూసైడ్ నోట్లో మెడికో సౌమ్య
కరీంనగర్: జిల్లాలోని నగునూరులోని ప్రతిమ వైద్య కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థిని సౌమ్య తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని తన లేఖలో స్పష్టం చేసింది. తన భర్తను కానీ, కుటుంబసభ్యులను కానీ బ్లేమ్ చేయొద్దని తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సూసైడ్ నోట్ ఆధారంగా దర్యప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం నగరం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన సుదునాల సౌమ్య (25) కరీంనగర్ మండలం నగునూరు గ్రామంలోని ప్రతిమ వైద్య కళాశాలలో పీజీ(డెర్మటాలజీ) మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి, ఖమ్మం ప్రధాన ఆస్పత్రి విశ్రాంత సివిల్ అసిస్టెంట్ సర్జన్ సుదునాల కొమరయ్య. ఆయన నాలుగేళ్ల కిందటే పదవీ విరమణ చేశారు.
సౌమ్య పీజీ (డెర్మటాలజీ) కోర్సు చదివేందుకు మే 14, 2014లో నగునూరులోని ప్రతిమ వైద్య కళాశాలలో చేరింది. కళాశాలకు చెందిన వసతి గృహం గదిలోనే మరో విద్యార్థినితో కలిసి ఉంటుంది. నల్గొండ జిల్లా మోతె గ్రామానికి చెందిన డాక్టర్ బొక్క పవన్కుమార్తో ఫిబ్రవరి 27న సౌమ్య వివాహం ఖమ్మం పట్టణంలో జరిగింది. రూ.16 లక్షల వరకట్నం ఇచ్చి పెళ్లి జరిపించారు. ఎంబీబీఎస్ కోర్సు పూర్తి కావడంతో పవన్కుమార్ సివిల్స్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. పెళ్లి సందర్భంగా సౌమ్య 20 రోజుల కిందట సెలవుపై వెళ్లింది.
హాస్టల్ గదిలోనే ఆత్మహత్య
మంగళవారం ఉదయం హైదరాబాద్లో ఉంటున్న భర్త పవన్కుమార్ దగ్గరి నుంచి కరీంనగర్కు వచ్చిన సౌమ్య.. ఉదయం 11 గంటల సమయంలో కళాశాలకు చేరుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాశాల తరగతులు, కోర్సుకు సంబంధించిన తనిఖీలకు హాజరైంది. రాత్రి సమయంలో తన భర్త పవన్కుమార్తో ఫోన్లో మాట్లాడింది. ఆ సమయంలో సౌమ్య తన సహ విద్యార్థినికి ఇబ్బంది కలగకుండా స్నేహితుల వద్దకు వెళ్లింది.
చాలాసేపటి తర్వాత తిరిగి గదికి చేరుకుంది. లోపలి వైపు గడియ పెట్టి ఉంచింది. సహ విద్యార్థిని వచ్చినా ఎంతకూ తలుపులు తీయకపోవడంతో విషయాన్ని కళాశాల సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. సిబ్బంది, తోటి విద్యార్థులు బలవంతంగా తలుపులు తెరిచారు. లోపలికి వెళ్లి చూడగా సౌమ్య చున్నీతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించింది.
వెంటనే కిందికి దించి చూడగా అప్పటికే మృతిచెందింది. దీంతో మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. కళాశాల సిబ్బంది విషయాన్ని సౌమ్య తల్లిదండ్రులు, భర్తకు ఫోన్ ద్వారా తెలియజేశారు. దీంతో వారు హుటాహటిన బుధవారం తెల్లవారుజామున కళాశాలకు చేరుకున్నారు.
వివాహమైన 17 రోజులకే సౌమ్య ఆత్మహత్య చేసుకోవడంతో అత్తిల్లు, పుట్టింట్లో తీరని విషాదం నెలకొంది. సమాచారం తెలియగానే కళాశాలకు వచ్చిన సౌమ్య తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. డీఎస్పీ రామారావు, కరీంనగర్ గ్రామీణ ఠాణా సీఐ కృష్ణగౌడ్, ఎస్సై మాధవరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
సౌమ్య ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించారు. 'నేను చేసిన తప్పులకు అపరాధ భావం తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నా. ప్లీజ్ డోంట్ బ్లేమ్ పవన్. బేబి ఐ లవ్ యూ. ఐ రియల్లీ లవ్ యూ. ఐ యామ్ సో సారీ' అని రాసి ఉన్న లేఖను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబికులకు సౌమ్య మృతదేహాన్ని అప్పగించారు.
తన కుమారుడు మృతిచెందడం, తాను అనారోగ్యంతో బాధపడుతుండటంతో కలత చెండం వల్లనో, ఇతర కారణాలతోనో సౌమ్య ఆత్మహత్య చేసుకుని ఉంటుందని సౌమ్య తండ్రి సుదునాల కొమరయ్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణగౌడ్ తెలిపారు. బుధవారం రాత్రి ఖమ్మం కాల్వొడ్డున ఉన్న శ్మశానవాటికలో సౌమ్య అంత్యక్రియలు జరిగాయి.
కొడుకు మృతి మరువకముందే మరో విషాదం
2010లో హైదరాబాద్లో మెడిసిన చదువుకుంటున్న సమయంలో కొమరయ్య కుమారుడు ప్రీతమ్కుమార్ రాఖీ సందర్భంగా చెల్లెలు సౌమ్యతో పువ్వు కట్టించుకునేందుకు వచ్చాడు. బైకు రైడింగ్ అంటే సరదా పడే అతడు తన స్నేహితునికి చెందిన పల్సర్లో ఖమ్మం బస్టాండు వరకు వచ్చి.. ఇంట్లో వారికి బస్సులో వచ్చినట్లు చెప్పాడు.
ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో బస్టాండు వరకు కారులో వచ్చి దిగబెట్టిన తండ్రి కొమరయ్యకు బస్సులోనే హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పాడు ప్రీతమ్కుమార్. అనంతరం కొమరయ్య జిల్లా ఆస్పత్రిలో విధుల్లో భాగంగా ఆపరేషన్ థియేటర్ ఉండగా ఫోన్ వచ్చింది. 'మీ కుమారుడు బైకుపై వెళ్తుండగా తల్లంపాడులో లారీ ఢీకొని చనిపోయాడు. వెంటనే రండి' అన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం.
ప్రీతమ్ బస్సులో వెళ్తున్నట్లు చెప్పాడు కదా? అని కొమరయ్య షాక్కు గురయ్యాడు. వాస్తవానికి హైదరాబాద్ నుంచి బైకుపై వచ్చిన ప్రీతమ్కుమార్ తిరుగు ప్రయాణంలో తల్లంపాడు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆ విషాదాంతాన్ని మరవక ముందే.. పెళ్లయిన కొద్దిరోజులకే కుమార్తె కూడా ఆత్మహత్యకు పాల్పడటంతో విశ్రాంత వైద్యుడు కొమరయ్య, ఆయన భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు.