జగన్తో నష్టం, టిడిపియే బెస్ట్!: చేయి కలపడం వెనుక.. ఇదీ కేసీఆర్ లెక్క, బాబుకు ఊరట
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడులు వ్యూహం ప్రకారమే తమ మధ్య విభేదాలను పక్కన పెట్టారా? అంటే కావొచ్చుననే చర్చ సాగుతోంది. ఓటుకు నోటు అంశం తెలుగు రాష్ట్రాల్లో వేడిని రాజేసింది. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం వీరు బెట్టు వీడినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు బెట్టు కోసం, ఒకరి మీద మరొకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తే విపక్షాలు లాభపడదాయని.. ఇద్దరు అధినేతలు గుర్తించారని, అందుకే కొంచం తగ్గి ఉండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.

వైయస్ జగన్
ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, ఆ పార్టీ నేతలు నిత్యం ఓటుకు నోటు అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. దీనిపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల కోర్టుకు కూడా వెళ్లారు. ఆ కేసు ముందుగు సాగడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చంద్రబాబు, కేసీఆర్ మధ్య ఏం రాజీ కుదిరిందని, ఓటుకు నోటు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. కేసు కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కేసు విషయాన్ని పక్కన పెడితే ఒకరిపై మరొకరు పై చేయి సాధించే క్రమంలోై ఏపీలో జగన్, తెలంగాణలో కాంగ్రెస్ లేదా బీజేపీలకు అవకాశం ఇచ్చినట్లవుతుందని, ఆ పార్టీలు అధికార పార్టీలను మరింత చిక్కుల్లో పడేస్తాయని భావించి, ఇరువురు నేతలు తగ్గి ఉంటారని అంటున్నారు.

చంద్రబాబు-కేసీఆర్
భావవ్యత్యాసం, రాజకీయ వైరుధ్యమున్న కేసీఆర్, చంద్రబాబుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న వాతావరణం, ఇప్పుడు కనిపించడం లేదు. విపక్షాలకు అవకాశం ఇవ్వవద్దనే కారణంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం వారు పైచేయి కోసం పావులు కదపడం ఆపివేసి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి.

సఖ్యత
జూన్ 2015 లో నమోదైన ఓటుకు నోటు కేసులో హైదరాబాదులోని ఏసీబీ ప్రత్యేక కోర్టు, పునర్విచారణ జరపాలని ఆదేశించిన అనంతరం ఇద్దరు సీఎంల మధ్యా సఖ్యత పెరిగిందనేది విపక్షాల ఆరోపణ. దానిని పక్కన పెడితే.. ఏడాది క్రితం వరకూ చంద్రబాబు పేరెత్తినా కూడా సహించేది లేదన్నట్టు మాట్లాడిన, హైదరాబాదులో చంద్రబాబును బయటి వ్యక్తిగానే భావిస్తామని చెప్పిన కేసీఆర్, తనవద్ద అందుబాటులో ఉన్న అన్ని ఆయుధాలనూ ఆయనపై ప్రయోగించేందుకు వెనుకాడబోమని సంకేతాలు ఇచ్చారని, ఇప్పుడు మాత్రం అలా చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. వరుసగా టిడిపి నేతలను తెరాసలో చేర్చుకున్నారు. తెలంగాణలో టిడిపి దాదాపు కనుమరుగైంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ 'ఆపరేషన్ టిడిపి'పై తగ్గవచ్చునని
అంటున్నారు.

జగన్ దగ్గరయ్యే ప్రయత్నం చేసినా..
కేసీఆర్, చంద్రబాబుల మధ్య ఉన్న విభేదాల కారణంగా, వైసిపి అధినేత జగన్.. తెరాసకు దగ్గరయ్యే ప్రయత్నం చేసారని, కానీ ఆయన ఆశలు అన్నీ నీరుగారిపోయాయని అంటున్నారు. మరోవైపు, చంద్రబాబు కూడా టిడిపి సమావేశాల్లో కేసీఆర్ గురించి పెద్దగా మాట్లాడటం లేదు. ప్రజల కోసం మీరు పోరాటం చేయమని తెలంగాణ టిడిపి నేతలకు మాత్రం సూచిస్తున్నారు. కేసీఆర్ పైన విమర్శలను చంద్రబాబు తగ్గించారు.

అమరావతికి కేసీఆర్, చండీయాగానికి చంద్రబాబు
అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వెళ్లిరాగా, కేసీఆర్ నిర్వహించిన అయుత చండీయాగానికి చంద్రబాబు హాజరయ్యారు. ఆపై ఇద్దరు నేతలు పలుమార్లు కలుసుకున్నారు. గవర్నర్ నరసింహన్తో పలుమార్లు భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల సమస్యలను చర్చించారు.

సఖ్యత కుదిర్చారా?
చంద్రబాబు, కేసీఆర్ల మధ్య సఖ్యతను కుదిర్చేందుకు ఓ ప్రముఖ సీనియర్ వ్యాపారవేత్త కృషి చేశారని, అది ఫలించిందనే ప్రచారం సాగుతోంది.

జగన్ రావొద్దని..
పొరుగున ఉన్న రాష్ట్రాలతో సఖ్యంగా ఉండటం ద్వారా అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపించడమే తన లక్ష్యమని చంద్రబాబు చెబుతుండగా, తెలుగు ప్రజలంతా రాష్ట్రంగా విడిపోయినా, అన్నదమ్ములేనని, కలసి ముందుకు సాగాలని కేసీఆర్ అంటున్నారు. ఏపీలో జగన్ను అధికారంలోకి రాకుండా చూడాలంటే, కేసీఆర్కు జగన్ను దగ్గర కానీయవద్దనేది బాబు ఉద్దేశ్యంగా ఉందని అంటున్నారు.

బీజేపీ ఎదగవద్దంటే..
తెలంగాణలో బీజేపీ లేదా వైసిపిఎదగకూడదంటే టిడిపి కొంతైనా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారని కూడా అంటున్నారు. కుల సమీకరణాల నేపథ్యంనూ కేసీఆర్, చంద్రబాబులను దగ్గర చేసి ఉంటుందని అంటున్నారు.

కేసీఆర్ ప్లాన్ ఇదీ..
అతి తక్కువ బలమున్న వెలమ వర్గానికి చెందిన నేతగా, తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో ఉన్న రెడ్డి వర్గాన్ని సంతృప్తి పరచకుంటే అధికారాన్ని ఎక్కువ కాలం అనుభవించలేమని కేసీఆర్ భావిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కాకున్నా భవిష్యత్తులో చంద్రబాబు కన్నా, జగన్తోనే తనకు ఎక్కువ నష్టమని కేసీఆర్ భావించడం వల్లే చంద్రబాబుతో స్నేహహస్తం చాటి ఉండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. టిడిపి తెలంగాణలో ఉంటే తెరాస వ్యతిరేక ఓట్లను చీలుస్తుందని కూడా భావిస్తున్నారట.












Click it and Unblock the Notifications