హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేవారికి అలర్ట్..?
ద్వాదశ జోతిర్లింగాల్లో ఒకటిగా పేరుగాంచింది శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లిఖార్జున ఆలయం. ప్రస్తుతం కార్తీకమాసం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు శ్రీశైలంకు తరలివస్తుంటారు. హైదరాబాద్ నుంచి కూడా శ్రీశైలానికి నిత్యం భక్తులు వస్తుంటారు. అయితే ప్రస్తుతం మొంథా తుపాను నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇక తుపాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు డిండి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉప్పొంగడంతో రోడ్డు పైనుంచి ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. దీంతో శ్రీశైలం- హైదరాబాద్ రహదారిపై డిండి నుంచి అచ్చంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మొంథా తుపాను శ్రీశైలంపై విరుచుకుపడుతోంది.
స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు వర్షం కారణంగా వసతి గృహాలకే పరిమితం అయ్యారు. మరోవైపు శ్రీశైలం పాతాళగంగ మెట్ల మార్గంపై కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండ కింద ఉన్న మూడు దుకాణాలు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. కొండ చరియలు విరిగిపడిన నేపథ్యంలో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే భారీ వరద నీరు ప్రవహిస్తున్న కారణంగా రోడ్డు మర్గం కోతకు గురైంది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీశైలం వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక తుపాను నేపథ్యంలో తెలంగాణలోని ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. అలాగే హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక అలాగే భారీ వర్షాల దృష్ట్యా రేపు వరంగల్ జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అంతేకాక పాఠశాలల్లో రేపటి ఎస్ ఏ-1 పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications