బీజేపీలో ఈటల చేరికపై డీకే అరుణ: ట్విట్టర్ మంత్రి, కుళ్లు రాజకీయాలంటూ కేటీఆర్, కేసీఆర్లపై ఫైర్
హైదరాబాద్: ఎలాంటి హామీ లేకుండానే మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు సిద్ధమయయారని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. బీజేపీలో అలకలు, బుజ్జగింపులు లేవని వ్యాఖ్యానించిన ఆమె.. పెద్దిరెడ్డి పార్టీలోనే కొనసాగుతారని చెప్పారు.
Recommended Video

ఈటల చేరడం బీజేపీకి లాభమేనంటూ డీకే అరుణ
పాతవారికి, కొత్త వారికి సమన్వయం ఉందని, అంతా కలిసే పనిచేస్తున్నామన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికలో ఎవరు పోటీ చేయాలనేది పార్టీయే నిర్ణయిస్తుందని డీకే అరుణ తెలిపారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం వల్ల పార్టీకి లాభమేనని అన్నారు. తాను పార్టీలో చేరినప్పుడు కూడా పార్టీలో ఏ హామీ ఇవ్వలేదని డీకే అరుణ చెప్పారు. అంతేగాక, తనకు చాలా మంది కాంగ్రెస్ నేతలు టచ్లో ఉన్నారని సంచలనం వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీలో భారీ చేరికలుంటాయన్నారు.

పేదలకు అండగా నిలవని కేసీఆర్ సర్కారు..
ఇది ఇలావుండగా, కేంద్రంపై విమర్శలు చేసిన మంత్రి కేటీఆర్పై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ కోసం రూ. రెండున్నరవేల కోట్లు ఖర్చు చేస్తామన్న కేసీఆర్ సర్కారు ఎక్కడా రూపాయి ఖర్చు చేయలేదన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల బిల్లులతో ఇబ్బందులు పడుతున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవలేకపోయిందని డీకే అరుణ ఆరోపించారు. రాజకీయం కోసం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ట్విట్టర్ మంత్రి కేటీఆర్ కుళ్లు రాజకీయాలు..
ప్రజల జీవితాలతో రాజకీయాలు చేసే కుళ్లు మనస్తత్వం కేటీఆర్ది అని.. భారత్ బయోటెక్ను వాళ్ళు విజిట్ చేశారా.. అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారా? అని నిలదీశారు. ట్విటర్ పిట్ట కేటీఆర్.. ట్విట్టర్ మంత్రిగా మారిపోయారని..హైటెక్ మంత్రిగా గొప్పలు చెప్పుకుంటున్నాడని.. క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో ఆయనకు తెలుసా ? అని నిలదీశారు. ప్రధాని భారత్ బయోటెక్ను సందర్శించడం జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.

మీలాంటి వాళ్ల జేబులు నింపడానికి కాదు వ్యాక్సినేషన్..
35 వేల కోట్ల రూపాయలు ఒక్క రోజే ఖర్చు చేస్తారా? డిఫెక్టో సీఎం సమాధానం చెప్పాలని కేసీఆర్కు చురకలు అంటించారు. ఉమ్మడి జిల్లా జనాభా అంత లేని దేశాలతో భారత దేశాన్ని పోల్చుతున్నాడని, విదేశీ వ్యాక్సిన్ దేశంలోకి రావడానికి నిబంధనలు ఉండవా ? అని ప్రశ్నించారు. మన దేశ వ్యాక్సిన్ కన్నా ఎక్కువ రేటు ఆ వ్యాక్సిన్లకు ఉందని.. మీ లాంటి వాళ్లు జేబులు నింపుకోవడానికి తెమ్మంటున్నరా? అని డీకే అని నిలదీశారు. మోడీ ఇమేజ్ను దెబ్బ తీయడానికి ఇలాంటి ప్రయత్నాలన్నారు. కుళ్లు రాజకీయాలు సరికాదన్నారు. వ్యాక్సిన్ ఎక్కువ వృధా చేసిన రాష్ట్రం తెలంగాణ అని, చిల్లర రాజకీయాలు వద్దని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications