వైద్యుల నిర్లక్ష్యం: సంతానం కోసం వెళితే.. మహిళ బ్రెయిన్డెడ్ !
హైదరాబాద్: సంతానం కలుగుతుందన్న ఆశతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఓ మహిళ.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైంది. అంతేగాక, ఆమె పరిస్థితి విషమంగా మారడంతో మరో ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. దీంతో సదరు మహిళ భర్త పోలీసులను ఆశ్రయించి వైద్యుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశాడు.
నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి భర్త కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా చౌటుప్పల్లో సాయిజ్యోతి ఆస్పత్రి డాక్టర్ సుమన్ కల్యాణ్కు 2007లో సాయిజ్యోతి (36) తో పెళ్లైంది. ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలు సాయిజ్యోతి చూసుకుంటోంది. వీరికి సంతానం కలగకపోవడంతో నాగోలు చౌరస్తాలోని సృజన సంతాన సాఫల్య కేంద్రం వైద్యులు సౌజన్య, రాణి, శ్రీశైలేష్ విఠల్లను సంప్రదించారు.
కాగా, చిన్నపాటి శస్త్ర చికిత్స చేస్తే సంతానం కలుగుతుందని డాక్టర్లు చెప్పారు. దీంతో ఈనెల 12వ తేదీ సాయంత్రం సాయిజ్యోతి, సుమన్ దంపతులు సృజన ఆసుపత్రికి వెళ్లారు.
ఆపరేషన్ కు ముందు వైద్యు లు స్వప్న, శ్రీకాంత్లు సాయిజ్యోతికి అనస్థీషియా (మత్తు) ఇచ్చారు. శస్త్ర చికిత్స ప్రారంభించిన వైద్యులు సాయిజ్యోతి పరిస్థితి విషమించినట్టు గుర్తించారు. కాగా, వైద్యులు శస్త్రచికిత్స చేస్తున్న సమయంలోనే సాయిజ్యోతి బ్రెయిన్ డెడ్ అయినట్లు సమాచారం.
వెంటనే అదే రోజు రాత్రి ఓమ్నీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి డాక్టర్లు తమ వల్ల కాదని చెప్పడంతో 13వ తేదీన ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రికి తరలించారు.
ఫిట్స్ రావడంతో సాయిజ్యోతి పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమెకు వెంటిలేటర్ అమర్చారు. రెండు వారాలుగా చికిత్స చేస్తున్నా.. ఆమె ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాకపోవడంతో భర్త సుమన్ కల్యాణ్ చైతన్యపురి పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
ఆస్పపత్రి వైద్యులు సృజన, శ్రీ శైలేష్ విఠల్, రాణి, అనస్థీషియా వైద్యులు స్వప్న, శ్రీకాంత్ల నిర్లక్ష్యం వల్లే తన భార్య ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణంపైకి వచ్చిందని సుమన్ కల్యాన్ సోమవారం మీడియాకు తెలిపారు.
నడుచుకుంటూ వెళ్లిన తన భార్యను స్పృహలేని స్థితిలో మరో ఆస్పపత్రికి తరలించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరొకరికి ఇలాంటి దుస్థితి రాకుండా ఉండాలంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు.