మీడియాకెక్కితే వేటే! పొత్తులు, సీఎం అభ్యర్థిపై టీ కాంగ్రెస్ నేతలకు రాహుల్ వార్నింగ్
న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అంతా సమష్టిగా కృషి చేయాలని పార్టీ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

ఇష్టారీతిన వద్దంటూ రాహుల్..
కలిసికట్టుగా ముందుకెళ్లండి.. అభిప్రాయభేదాలుంటే పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ఇంర్జితో పాటు అవసరమైతే తనతో నేరుగా మాట్లాడండని నేతలకు సూచించారు. అంతేగానీ, పార్టీకి నష్టం కలిగించే విధంగా ఇష్టారీతిగా మీడియా ముందుకు వెళ్లవద్దని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఎవరికి వారుగా ప్రకటనలు చేయొద్దని స్పష్టంగా చెప్పారు. హద్దు మీరి మాట్లాడినా.. క్రమశిక్షణ తప్పినా ఎంతటి పెద్ద నేతపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.

మూడు గంటలపాటు భేటీ
తెలంగాణలో పార్టీ పరిస్థితి, విజయావకాశాలు, పొత్తులు, నేతల మధ్య సమన్వయం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్లో రాష్ట్రానికి చెందిన 38 మంది ముఖ్య నేతలతో రాహుల్గాంధీ శుక్రవారం విడివిడిగా సమావేశమయ్యారు. మూడు గంటలపాటు వారి అభిప్రాయాలు, సూచనలను ఆయన విన్నారు. ఆయా జిల్లాల్లో పార్టీల బలాబలాలు, సమస్యలు, అభ్యర్థుల ఎంపికకు ప్రాతిపదిక తదితర అంశాలను నేతలు ఆయనకు వివరించారు.

రాహుల్, సోనియాల సభలకు ఓకే
పాత జిల్లాల ప్రాతిపదికన రాహుల్ గాంధీ ప్రతి జిల్లాలో ఒక సభలో పాల్గొనాలని, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ సభలు పెట్టాలని తెలంగాణ నేతలు కోరారు. కాగా, బహిరంగ సభల విషయమై నేతలు రాహుల్ గాంధీతో మాట్లాడినప్పుడు నేతలు కోరినట్లు పది సభల్లో పాల్గొంటానని హామీ ఇచ్చారు. సోనియాగాంధీతో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెడతామని నేతలు కోరగా రాహుల్ అంగీకరించారు.

టార్గెట్ మిస్సవద్దు
తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోలేకపోయామని, ఈ దఫా ఆ పరిస్థితి పునరావృతం కానివ్వద్దని నేతలకు రాహుల్ గాంధీ గట్టిగా చెప్పారు. నీటిపారుదల ప్రాజెక్టుల పనుల్లో అవినీతి, నిరుద్యోగం, కుటుంబపాలన, దళితుల సమస్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణలో బలమైన నేతలతోపాటు శ్రేణుల బలం కాంగ్రెస్కు ఉందని, దీనిని సద్వినియోగం చేసుకుందామన్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని రాహుల్ పిలుపునిచ్చారు.

అభిప్రాయ భేదాలు పక్కన పెట్టండి..
అభిప్రాయభేదాలను పక్కన పెట్టాలని, వర్గాలను ప్రోత్సహించి పార్టీ అవకాశాలకు గండికొట్టవద్దని రాహుల్ గాంధీ తెలంగాణ నేతలకు స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోస్ రాజు, రాధాకృష్ణన్, శ్రీనివాసన్ కృష్ణన్, సలీం అహ్మద్, పార్టీ అధికార ప్రతినిధి జైపాల్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, శాసనసభ, శాసనమండలి సభ్యులు, పీసీసీ మాజీ అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

త్యాగాలు వద్దు..టీఆర్ఎస్ను ఓడించాలంటే నేతల సూచనలు
పొత్తులపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, గెలిచే స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని రాహుల్ గాంధీ నేతలకు సూచించారు. వార్ రూమ్లో నేతలతో విడివిడిగా మాట్లాడే సమయంలో పొత్తులపై నేతలు రకరకాలుగా స్పందించారు. కాంగ్రెస్కు నియోజకవర్గ స్థాయి నేతలు లేని చోట్ల, ఇతర పార్టీలకు బలమైన నేతలున్న స్థానాలనే మిత్రపక్షాలకు ఇవ్వాలని సూచించారు.
పొత్తులు పరస్పర లాభదాయకంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. కాంగ్రెస్తోనే తెలంగాణ సాధ్యమైందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఇతర పార్టీల నుంచి చేరే వారికి సీట్ల హామీలు ఇవ్వవద్దని, భేషరతుగా చేరేలా చూడాలన్నారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు సీపీఎం, బీఎల్ఎఫ్ను కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేయాలని, బీసీలు, ఎస్సీలు, తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులను ఆకర్షించాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సూచించారు. తెలంగాణ సమాజం మెచ్చేలా పొత్తులు ఉండాలని సీఎల్పీ ఉప నేత పొంగులేటి సుధాకర్రెడ్డి పేర్కొన్నారు. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని, నాలుగేళ్లుగా కష్టపడిన నేతలను గుర్తించాలని మహిళా నేతలు డి.కె.అరుణ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఆకుల లలిత, శారద సూచించారు.
పొత్తుల అంశంలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, ప్రజల్లో పలుకుబడి.. మంచి పేరున్న నేతలకే టిక్కెట్లు ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్రెడ్డిలు వివరించారు. కేసీఆర్ను ఓడించాలంటే టెస్ట్ మ్యాచ్ కుదరదు.. 20-20 మ్యాచ్ ఆడాలి అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కాగా, నేతల సూచలను రాహుల్ గాంధీ సావదానంగా విన్నారు.












Click it and Unblock the Notifications