69 లక్షల మంది ఒక్క డోస్ టీకా కూడా తీసుకోలేదు - తేలిగ్గా తీసుకోవద్దు: తెలంగాణ డీహెచ్ హెచ్చరిక..!!
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ వంద కోట్లకు చేరింది. తెలంగాణలో ఒకటి లేదా రెండు రోజుల్లో రెండు కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి కానుంది. కానీ, అనూహ్యంగా అసలు వ్యాక్సిన్ తీసుకోని వారి సంఖ్య భారీగా ఉంది. దీని పైన ప్రజారోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 69 లక్షల మంది ఇంకా ఒక్క డోసు కూడా టీకా వేసుకోలేదని.. వీరంతా వెంటనే వేసుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు సూచించారు. వ్యాక్సిన్ తీసుకొనే విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు.
ఒక్క వ్యాక్సిన్ సైతం తీసుకోకుండా
తెలంగాణలో ప్రస్తుతం నమోదువుతున్న కోవిడ్ పాజిటివ్ కేసుల్లో అసలు ఇప్పటి వరకు ఒక్క వ్యాక్సిన్ కూడా తీసుకోని వారే ఎక్కువగా ఉన్నారని ఆయన వివరించారు. వ్యాక్సిన్ తీసుకోని వారికే వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే రష్యా, యూకేలలో కేసులు, మరణాలు పెరుగుతున్నాయని, అందుకే ప్రజ లు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని మొదటి డోసు వేసుకున్నవారు రెండో డోసు వేసుకునే విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. వైరస్ సోకుతున్న వారిలో 60 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోని వారే ఉంటున్నట్లుగా గుర్తించారు.
రెండు కోట్లకు చేరనున్న వ్యాక్సినేషన్
తొలి డోసు తీసుకున్న వారిలో 30 శాతం మందికి మాత్రమే కరోనా వచ్చే అవకాశం ఉంటుందని తేల్చారు. అదే విధంగా రెండు డోసులు పూర్తయిన వారిలో మాత్రం 5 నుంచి 10 శాతం మందికే కరోనా సోకుతున్నట్లుగా తేలింది. తొలి డోసు తీసుకున్న వారు తప్పనిసరిగా రెండో తీసుకొనే విషయంలో అలక్ష్యం వద్దని శ్రీనివాస రావు హెచ్చరించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 75 మందికి తొలి డోసు పూర్తి కాగా... 39 శాతం మందికి రెండో డోసు టీకా వేసినట్లుగా వెల్లడించారు. ఒకటి లేదా రెండు రోజుల్లోనే తెలంగాణ లో మూడు కోట్ల వ్యాక్సినేషన్ పూర్తి కానుంది.
పాజిటివిటీ శాతం 0.4 గా నమోదు
ప్రభుత్వ లెక్కల ప్రకారం మరో 37 శాతం మందికి రెండో డోసు టీకా వేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ప్రస్తువం 50 లక్షల డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య 0.4 శాతంగా మాత్రమే నమోదవుతోంది. మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకొని... గడువు ముగిసినా ఇప్పటికీ ఇంకా రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవారు రాష్ట్ర వ్యాప్తంగా 36.35 లక్షల మంది ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. వచ్చే రెండు మూడు వారాల్లోనే చిన్న పిల్లలకు సైతం వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని డీహెచ్ శ్రీనివాస రావు చెప్పుకొచ్చారు.
త్వరలో చిన్నారులకు వ్యాక్సిన్
2 నుంచి 18 ఏళ్ల వయసు వారికి వేసే జైడస్ వ్యాక్సిన్కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. త్వరలో భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్కు సైతం అనుమతులు వచ్చే అవకాశం ఉందన్నారు. కోటి మంది పిల్లలకు వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుందని వివరించారు. బూస్టర్ డోసుకు సంబంధించి భారత్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, భవిష్యత్తులో బూస్టర్ డోసును వేసే అవకాశం ఉండొచ్చని శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు.