రాత్రి హైదరాబాద్లో ఎరుపెక్కిన రోడ్లు- భయాందోళనలు
Hyderabad: హైదరాబాద్ రోడ్లు సోమవారం రాత్రి ఉన్నట్టుండి ఎరుపెక్కాయి. ఎరుపురంగు కలిసిన నీరు పోటెత్తింది. చిక్కటి రక్తంలా కనిపిస్తోన్న మురుగునీరు రోడ్లపై పారుతోండటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. సుభాష్ నగర్, వెంకటాద్రినగర్ వంటి కొన్ని కాలనీల్లో రాత్రి ఒక్కసారిగా ఈ ఎరుపురంగు కలిసిన మురుగునీరు మ్యాన్హోళ్ల నుంచి ఉబికివచ్చింది. భరించలేనంత దుర్వాసనను వెలువడింది. ఘాటైన రసాయనాలు కలిసిన దుర్గంధం ఆ ప్రాంతంలో వ్యాప్తి చెందింది.

దీనివల్ల స్థానికులు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. వయోధిక వృద్ధులు ఊపిరి పీల్చుకోవడంలో సతమతపడ్డారు. దగ్గడం, కళ్లు ఎరుపెక్కడం వంటి పరిణామాలను చవి చూడాల్సొచ్చింది. ఈ మార్గంలో ప్రయాణించడానికి వాహనదారులు వెనుకాడారంటే వారిలో నెలకొన్న ఆందోళన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో ఉండే కొన్ని గోడౌన్లల్లో పెద్దఎత్తున కెమికల్స్ను నిల్వ చేస్తోండటం, అక్కడి చిన్న తరహా యూనిట్లల్లో రసాయనిక వ్యర్థాలను డ్రైనేజీలోకి వదులుతోండటం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు గుర్తించారు.
జీడిమెట్ల, బాలానగర్ వంటి పారిశ్రామికవాడల్లో వందల సంఖ్యలో భారీ, చిన్న తరహా పరిశ్రమలు దశాబ్దాల కాలం నుంచీ కొనసాగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. వాటిల్లో చాలావరకు ఫార్మాసూటికల్స్ రంగానికి సంబందించినవే. ఫలితంగా రసాయనిక పదార్థల వినియోగం అధికంగా ఉంటోంది.
నగరం వ్యాప్తి చెందడం తరువాత వాటి చుట్టూ జనావాసాలు ఏర్పడ్డాయి. కాలనీలు వెలిశాయి. కొన్ని చిన్న తరహా పరిశ్రమల నుంచి వెలువడే రసాయనిక వ్యర్థాలను స్థానికంగా డ్రైనేజీలో వదులుతున్నారనే ఫిర్యాదులు చాలాకాలం నుంచీ ఉన్నాయి. అలాగే జనావాసాల మధ్య గల గోడౌన్లల్లో ఈ కెమికల్స్ నిల్వలను ఉంచడం వల్లా ఇలాంటి పరిస్థితులు తరచూ సంభవిస్తుంటాయక్కడ.












Click it and Unblock the Notifications