రేవంత్ ప్రమాణ స్వీకారానికి స్పెషల్ గెస్ట్గా.. !!
Revanth Reddy: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సాయంత్రానికి ఆయన హైదరాబాద్కు చేరుకుంటారు. గురువారం మధ్యాహ్నం 1:04 నిమిషాలకు లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రొనాల్డ్ రాస్.. ఇతర అధికారులు ఈ ఉదయం ఎల్బీ స్టేడియాన్ని సందర్శించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు.

రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్లు తరలి రానున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మరుగుజ్జు దివ్వాంగురాలు రజిని హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెకు అధికారులు ఆహ్వాన పత్రాన్ని పంపించినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బోయగూడ కమాన్లో నివాసం ఉంటోన్నారు రజిని. రేవంత్ రెడ్డి సూచనల మేరకు అతిథుల లిస్ట్లో ఆమె పేరును చేర్చినట్లు సమాచారం.
38 సంవత్సరాల రజిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ను పూర్తి చేశారు. పేద కుటుంబానికి చెందిన ఆమె ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఫలితం దక్కలేదు. అక్టోబర్ 17వ తేదీన ఆమె రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలి ఉద్యోగం ఇస్తానని అప్పట్లో రేవంత్.. హామీ ఇచ్చారు. ప్రమాణ స్వీకారం రోజే ఆమెకు ఉద్యోగాన్ని ఇస్తూ సంతకం చేసే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications