విచారించి, శిక్షించండి: జగన్కు ఈడీ కేసులో సమన్లు
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి న్యాయస్థానం శనివారం నాడు నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద రాంకీ ఫార్మా లిమిటెడ్కు సంబంధించిన వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని ఈడీ ప్రత్యేక కోర్టు హోదా కలిగిన సిబిఐ ప్రధాన కోర్టు విచారణ కోసం పరిగణలోకి తీసుకుంది.
ఈ కేసులో జగన్ సహా ఇతర నిందితులకు సమన్లు ఇచ్చింది. నిందితులు మనీ లాండరింగ్ చట్టం కింద నేరానికి పాల్పడ్డారని, నిందితులను చట్ట ప్రకారం విచారించి, శిక్షించాలని మార్చి 30న ఈడీ ఫిర్యాదును దాఖలు చేసింది. సాంకేతిక అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కోర్టు దానిని వెనక్కి పంపింది.
అన్ని అభ్యంతరాలను పూర్తి చేయడంతో విచారణ నిమిత్తం తాజాగా కోర్టు దానిని పరిగణలోకి తీసుకుంది. కేసులో ప్రధాన నిందితుడు జగన్తో పాటు విజయ సాయి రెడ్డి, జగతి పబ్లికేషన్స్, అయోధ్య రామిరెడ్డి, వెంకట్రామి రెడ్డి, రాంకీ ఫార్మాసిటి ప్రయివేటు లిమిటెడ్లకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 23న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.