ఈడీ నోటీసులు కాంగ్రెస్ అగ్రనాయకత్వ మనోధైర్యాన్ని ఏమాత్రం దెబ్బతీయలేవు.!రేవంత్ ఘాటు స్పందన.!
హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎనిమిదేళ్ల పాలన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీనే కలలోకి వస్తున్నట్టుందని, అందుకే కాంగ్రెస్ పార్టీ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారని మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు, ఎ. రేవంత్ రెడ్డి బీజేపి పై మండిపడ్డారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన ప్రైవేటు ఫిర్యాదు పై నమోదు చేసిన కేసును ఎనిమిదేళ్లుగా సాగతీస్తూ, తాజాగా శ్రీమతి సోనియాగాంధీ, శ్రీ రాహుల్ గాంధీలకు ఈడీ ద్వారా నోటీసులు ఇప్పించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు రేవంత్ రెడ్డి.

సోనియా,రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసుల పై రేవంత్ స్పందన.. బీజేపి ఉడత బెదిరింపులన్న పీసిసి ఛీఫ్
బీజేపీది, బ్రిటీషువారిది ఒక్కటే భావజాలమని, నాడు వారి అణచివేత, దౌర్జన్యానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడిందని రేవంత్ గుర్తు చేసారు. ఇప్పుడు వారి భావజాలానికి వారసులైన బీజేపీ - మోదీ అణచివేత, కుట్రలకు వ్యతిరేకంగా అంతే ఉత్తేజంతో పోరాడుతుందని ధీమా వ్యక్తం చేసారు. నాటి స్వాతంత్ర్య సంగ్రామానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ నేడు మోదీని గద్దె దింపే ఉద్యమానికి నాయకత్వం వహిస్తుందని, తాజాగా ఈడీ నోటీసులు కాంగ్రెస్ అగ్రనాయకత్వ మనోధైర్యాన్ని ఏమాత్రం దెబ్బతీయలేవన్నారు రేవంత్ రెడ్డి.

వేదింపులతో కాంగ్రెస్ కుంగిపోదు.. వెయ్యి సునామీల బలంతో ముందడుకు వేస్తుందన్న రేవంత్
బీజేపీ ప్రజావ్యతిరేక పాలనపై మా పోరాటాన్ని ఈడీ సోటీసులు అడ్డుకోలేవని, ఈ పరిణామం మా కార్యకర్తలలో మరింత కసి, పట్టుదలను పెంచుతుందన్నారు రేవంత్ రెడ్డి. ఈ వేదింపులతో కాంగ్రెస్ కుంగిపోతుందని భావిస్తే అది వారి భ్రమ అని, అధికారం ఇస్తే విదేశాల నుండి నల్లధనం తెచ్చి, ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానన్న మోదీ పేదలను మోసం చేశాడన్నారు రేవంత్. బ్యాంకులను ముంచిన నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను దేశానికి తిరిగి తీసుకురాలేకపోయారని, 70 ఏళ్ల ప్రజల శ్రమ, చమట చుక్కలతో కాంగ్రెస్ నిర్మించిన వ్యవస్థలను మోదీ ధ్వంసం చేశారని పీసిసి ఛీఫ్ మండిపడ్డారు.

దేశంలో మోదీ నయా బ్రిటీష్ పాలన.. అంతమొందిస్తామన్న రేవంత్ రెడ్డి
దేశ ప్రజల సంపదను అదానీకి అడ్డగోలుగా అమ్ముతున్నారని, పెట్రోలు, డీజిల్ ధరలతో పాటు నిత్యావసరాల ధరలు విచ్చలవిడిగా పెంచేసి పేదల నడ్డి విరుస్తున్న బీజేపి మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు రేవంత్ రెడ్డి. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం అనే ప్రశ్నే ఉండదని నమ్మబలికి, దేశంలో మరింత నల్లధన వ్యాప్తికి కారకులయ్యారని ధ్వజమెత్తారు. దేశంలో నయా బ్రిటీష్ పాలన నడుస్తోందని, దీనిపై శ్రీమతి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు రేవంత్ రెడ్డి.

బీజేపి కుటిల రాజకీయాల మీద పోరాటం ఉదృతం చేస్తాం.. దేశాన్ని గెలిపిస్తామన్న పీసిసి ఛీఫ్
మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాల మీద వ్యతిరేకంగా దేశప్రజలు, రైతులు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీకి అండగా నిలిచారని రేవంత్ గుర్తు చేసారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో రాహుల్ గాంధీ రైతులకు అండగా నిలిచారన్నారు. రాహుల్ గాంధీకి దేశ ప్రజలు, రైతులు మద్దతుగా నిలిచారన్నారు. ఇది సహించలేకనే ఈడీ నోటీసులతో వారి మనోధైర్యాన్ని దెబ్బతీయాలని మోదీ భావిస్తున్నారని, అది జరిగే సమస్యే లేదన్నారు. పోరాడుతాం... గెలుస్తాం. దేశాన్ని గెలిపిస్తామన్నారు పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి.












Click it and Unblock the Notifications