కేసీఆర్ పై కుట్రలో భాగంగా కవితకు ఈడీ నోటీసులు: భగ్గుమన్న బీఆర్ఎస్ మంత్రులు!!
కవితకు ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కవితకు ఈడీ నోటీసులు కేసీఆర్పై కుట్రలో భాగమేనని బీఆర్ఎస్ మంత్రులు ఆరోపించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంచలన సంఘటన చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నోటీసులు జారీ చేయడంతో బిఆర్ఎస్ నేతలు బిజెపి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కెసిఆర్ ని రాజకీయంగా ఇరకాటంలో పెట్టాలని కవితకు నోటీసులు జారీ చేశారని మంత్రులు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

ఇది కేసీఆర్ పై కుట్రలో భాగం : మంత్రి పువ్వాడ
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ రోజున కవితకు నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని మండిపడ్డారు. మహిళలపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో ఈ నోటీసులతో అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. కావాలని కెసిఆర్ పై కుట్రలో భాగంగా కవితకు నోటీసులు ఇచ్చినట్టుగా ఆయన ఆరోపించారు.

రాజకీయ దురుద్దేశంతోనే కవిత పై ఆరోపణలు: మంత్రి జగదీష్ రెడ్డి
ఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులు ఇవ్వడంపై రాష్ట్రవిద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. సూర్యాపేట లో ఆయన మీడియా తో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులు ఇవ్వడం మోడీ ప్రభుత్వ దుర్మార్గపు చర్య అన్నారు. రాజకీయ దురుద్దేశం తోనే కవిత పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. కేంద్రంలోని అధికార బిజెపి ప్రభుత్వం, మోడీ దురాగతాలను బయట పెడుతున్న కేసీఆర్ పైకుట్ర లో భాగంగానేకవిత కు నోటీసులు ఇచ్చారన్నారు. అణచివేత ధోరణి తోనే కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తుంది అన్నారు.

మోడీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట: మంత్రి గంగుల కమలాకర్
ఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులపై మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ నోటీసులు ఇవ్వడం బిజెపి కుట్ర అంటూ ఆరోపించారు. మహిళా దినోత్సవం రోజున ప్రధాని మోడీ ఆడపిల్ల కన్నీళ్లు చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని కావాలని కక్ష సాధింపు చర్యలలో భాగంగా నోటీసులు ఇచ్చినట్టుగా పేర్కొన్నారు. కవితకు ఈడి నోటీసులు మోడీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అని అసహనం వ్యక్తం చేశారు.

అరెస్ట్ చేసినా పోరాటం కొనసాగుతుంది: మంత్రి ఎర్రబెల్లి
కవితకు ఈడీ నోటీసులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి బిజెపి ఒక పాలసీతో వెళుతుందని, ముందుగా కేంద్ర దర్యాప్తు సంస్థలతో నోటీసులు ఇచ్చి, అప్పుడు కూడా భయపడకపోతే అరెస్టు చేస్తుందని, జైలుకు పంపుతుందని ప్రతిపక్షాలను అణచివేసే చర్యలో భాగంగా ఈ తరహా చర్యలకు పాల్పడుతుందని అన్నారు. అరెస్టు చేసినా వెనక్కి తగ్గేది లేదని, కేంద్రంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications