ఎన్నారై కోటాలో మార్పిడికి కుట్ర: కోట్ల విలువైన పాత నోట్ల పట్టివేత
ఎన్నారై కోటాలో రద్దయిన పాత నోట్లను మార్పిడి చేయడానికి ప్రయత్నించిన 8 మందిని పోలీసులు అరెస్టు చేసి, భారీగా నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్, సికిందరాబాద్లో రద్దయిన పాత నోట్ల మార్పిడికి పాల్లడుతున్న 8 మందిని టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారంనాడు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీగా పాత నోట్లు స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ఫోర్స్ నార్త్జోన్ డిసిపి లింబారెడ్డి తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి, ఆ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
సికిందరాబాద్లో నోట్ల మార్పిడి జరుగుతుందని సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకొని రూ. 4.41 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులని, వీరిలో కళ్యాణి ప్రసాద్ అనే వ్యక్తి కీలక సూత్రధారిగా వ్యవహరించాడు.
వందకు రూ. 30 శాతం కమీషన్తో నోట్లు మార్చడానికి ముఠా సభ్యులు మహమ్మద్ ఫారూఖ్, ముజఫర్, గౌతమ్ అగర్వాల్, సూర్యప్రసాద్, హరినాథ్ బాబు, రాజేంద్రనాథ్, మహమ్మద్ ముస్త్ఫా సిద్దిఖీ తదితరులు డీల్ పెట్టుకున్నారని గుర్తించారు. రాజు అనే మరో వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ముఠాకు ఏ బ్యాంకు సిబ్బందితోనూ సంబంధాలు లేవని డిసిపి స్పష్టం చేశారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.
ఎన్నారై కోటాలో మార్పిడికి
రద్దయిన రూ.500 రూ.1,000 నోట్లను ప్రవాస భారతీయుల (ఎన్నారై) కోటాలో భారీ మొత్తంలో మార్పిడికి ఆ ఎనిమిది మంది ముఠా కుట్రపన్నింది. సీతాఫల్మండిలోని రవీందర్నగర్లో నివసించే పి. కల్యాణ్ ప్రసాద్ రియల్టర్. అతని వద్ద భారీ నల్లధనం ఉంది. నోట్ల రద్దు ప్రకటన తర్వాత రూ.60 లక్షలు తన బ్యాంకు ఖాతాలో జమ చేయడంతో ఆదాయం పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకున్నాడు. దీంతో తన వద్ద మిగిలిన రూ.12 కోట్లను బ్యాంకులో జమ చేయలేదు.
వారిని సంప్రదించాడు...
నోట్ల మార్పిడికి సాధారణ గడువు ముగిసిన తర్వాత కూడా వాటిని మార్చడానికి ప్రయత్నించాడు. ఇందులో భాగంగా బిల్డర్, చార్టెడ్ అకౌంటెంట్ అయిన తన స్నేహితులు కె. హరినాథబాబు, పి. రాజేంద్రనాథ్లను కల్యాణ్ ప్రసాద్ సంప్రదించాడు. వారికి సమీప బంధువైన రాజు తనకు ఆర్బిఐలో పరిచయాలు ఉన్నాయని, ఎంత మొత్తాన్నైనా మారుస్తానని నమ్మించాడు. ఎన్నారైలకు పాత నోట్ల మార్పిడికి జూన్ 30వ తేదీ వరకు గడువు ఉందని, మార్పిడి చేయిస్తానని చెప్పాడు. చిన్న మొత్తాల మార్పిడి సాధ్యం కాదని, రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు తనకు పరిచయం ఉన్న ఆర్బిఐ అదిారులు 65 శాతం కమిషన్తో మార్పిడి చేస్తారని చెప్పాడు.
పరిచయస్తులు, స్నేహితులతో కలిసి...
కల్యాణ్ ప్రసాద్ వద్ద 12 కోట్ల రూపాయలు ఉండడంతో తన పరిచయస్తులను, స్నేహితులను సంప్రదించాడు. పాత నోట్లు ఉంటే మార్చుకుందామని చెప్పాడు. దీంతో ఐదుగురు ముందుకు వచ్చారు. హైదరాబాదులోని పంజగుట్టకు చెంది హమ్మద్ ఫారూఖ్ (సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారి), రూ.39.9 లక్షలు, ఆసిఫ్నగర్కు చెందిన మీర్జా ముజఫర్ (బియ్యం వ్యాపారి) రూ.5228 లక్షలు, బంజారాహిల్స్కు చెందిన గౌతమ్ అగర్వాల్ (ముత్యాల వ్యాపారి) రూ.1.46 కోట్లు, చింతల్కు చెందిన వై. సూర్యప్రసాద్ (విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి) రూ.50 వేలు, ఫలక్నుమాకు చెందిన మహ్మద్ ముస్తాఫా సిద్ధిఖీ (విద్యార్థి) రూ. 5 లక్షలు తెచ్చారు.
ఈ మొత్తం సమీకరించారు...
హరినాథ్ రూ.50 లక్షలు, రాజేంద్రనాథ్ రూ.42.23 లక్షలు సమీకరించారు. గౌతమ్, ఫారూఖ్ తన స్నేహితులైన రిషబ్, అష్మీ, హసన్ వద్ద ఉన్న నోట్లను తీసుకొచ్చారు. ఈ ఎనిమిది మంది మొత్తం. 4.41 కోట్ల విలువైన పాత నోట్లతో శ్రీనగర్ కాలనీలోని గౌతమ్ ఇంటికి చేరుకున్నారు.
రాజు కోసం ఎదురు చూస్తుండగా...
గౌతమ్ నివాసంలో వారంతా రాజు కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన సమాచారం అందడంతో హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్. రాజా వెంకటరెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎం. ప్రభాకర్ రెడ్డి, పి. మల్లికార్డున్, ఎల్ భాస్కర్ రెడ్డి తమ బృందాలతో దాడి చేసి ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
నిందితుల నుంచి భారీ మొత్తం...
నిందితుల నుంచి పోలీసులు నగదు, కారు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించి పరారీలో ఉన్న రాజు కోసం గాలిస్తున్నారు. అతను చిక్కిన తర్వాత విచారణలో ఆర్బిఐ అధికారుల పాత్ర వెలుగులోకి వస్తే తగిన చర్యలు తీసుకుంటామని లింబారెడ్డి చెప్పారు.