5వేల సిమ్ కార్డులతో డిజిటల్ మార్కెటింగ్లో భారీ మోసం..
ముఠా నుంచి 5వేల సిమ్కార్డులు, 89 సెల్ఫోన్లు, 8 ల్యాప్టాప్లు, 50వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
హైదరాబాద్: కమీషన్ కోసం నకిలీ వినియోగదారులను సృష్టించి కంపెనీలను బోల్తా కొటిస్తున్న ఓ ముఠా వ్యవహారాన్ని రాచకొండ పోలీసులు బట్టబయలు చేశారు. రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఈ ముఠా గుట్టు రట్టు చేసింది.
వనస్థలిపురం, ఎన్జీవోకాలనీకి చెందిన మిర్యాల సందీప్(26), అతని స్నేహితులతో కలిసి ఈ అక్రమానికి పాల్పడ్డాడు. మోసంపై సమాచారం అందుకున్న వెంటనే.. స్పెషల్ టీమ్ తో రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు వారి స్థావరంపై దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేశారు.
ఇలా డిజిటల్ మోసం..:
బీటెక్ చదివిన మిర్యాల సందీప్(26) ఎస్సీఎస్ టెక్నాలజీస్ పేరుతో ఒక సంస్థను ఏర్పరుచుకున్నాడు. ఇదే క్రమంలో రూ.30వేలు చెల్లించి జీఎస్ మీడియా అనే సంస్థలో సర్వీసు ప్రొవైడర్గా సభ్యత్వం పొందాడు.
ఈ మేరకు ఎస్సీఎస్ టెక్నాలజీస్ తరుపున సందీప్ వారికి వినియోగదారులను సమకూర్చాల్సి ఉంటుంది. దీంతో తన స్నేహితులను ఉపయోగించుకుని నకిలీ వివరాలతో, నకిలీ వినియోగదారులను సందీప్ సృష్టించాడు.
జీఎస్ మీడియాకి లాగిన్ అయి:
సందీప్ తన జీఎస్ మీడియా లాగిన్ ఐడీ వివరాలను స్నేహితులకు కూడా ఇచ్చాడు. దీంతో ఆయా డిజిటల్ కంపెనీలకు వినియోగదారులను అందించడానికి వారు నకిలీ వినియోగదారుల వివరాలు పొందుపరిచడం ప్రారంభించారు.
ఇదంతా గమనించిన కంపెనీలు సందీప్ కు డబ్బు చెల్లిస్తుండటం.. ఆ డబ్బులో కొంత కమీషన్ ను సందీప్ స్నేహితులకు చెల్లిస్తుండటంతో ఈ ముఠా వ్యవహారం లాభసాటిగా మారిపోయింది.
ముఠా సభ్యులు:
ఈ మొత్తం వ్యవహారంలో సందీప్ తో పాటు అతని స్నేహితలు బోయపల్లి మనోజ్కుమార్గౌడ్, అనుగు సురేందర్రెడ్డి, జెనిగా శ్రీనివాస్, మానకొండూరు వేణుమాధవ్, కావలి శ్రీశైలం.. ఇలా వీరంతా కలిసి ఓ గ్యాంగ్ గా ఏర్పడ్డారు.
వోడాఫోన్ డిస్ట్రిబ్యూటర్లు బొమ్మ మురళీకృష్ణ, కాచం రవికాంత్ల దగ్గర నుంచి 500 సిమ్కార్డులను తీసుకొని నకిలీ వినియోగదారులను సృష్టించారు. సిమ్కార్డులు పొందేటప్పుడు డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఉన్న ఇతర వినియోగదారుల ఫొటోలు, ధ్రువీకరణ పత్రాలను సేకరించి.. వారి పేరిట నకిలీ వినియోగదారులను సృష్టించారు.
89డ్యూయెల్ ఫోన్స్ తో వ్యవహారమంతా:
నకిలీ వినియోగదారుల పేరిట సృష్టించిన సిమ్ కార్డులను ఉపయోగించేందుకు మొత్తం 89డ్యూయెల్ ఫోన్స్ ను సందీప్ వాడాడు. కంపెనీ కాల్స్ కు, మెసేజ్ లకు తన స్నేహితులు అప్పటికప్పుడు బదులిచ్చేలా.. ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాడు.
ఈ అక్రమాలతో సందీప్ ముఠా లక్షలు సంపాదిస్తున్నట్టుగా పోలీసులు తేల్చారు. మొత్తం మీద పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేయడంతో వీరి డిజిటల్ మార్కెటింగ్ మోసానికి తెరపడింది. ముఠా నుంచి 5వేల సిమ్కార్డులు, 89 సెల్ఫోన్లు, 8 ల్యాప్టాప్లు, 50వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరంతా వనస్థలిపురం పోలీసుల అదుపులో ఉన్నారు.