తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల డీఏ విడుదలకు ఈసీ అనుమతి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు కేంద్రం ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్లో ఉండగా.. ఒక డీఏ విడుదలకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య సంప్రదింపులు జరిగాయి.
డీఏల చెల్లింపు ఎందుకు ఆలస్యమైందని.. ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారని ఈసీ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గతంలో డీఏల చెల్లింపు విధానాలపైనా ఈసీ ఆరా తీసింది. డీఏ విడుదలకు అనుమతి ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా ఈసీకి తమ వినతిని పంపాయి.

ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కారణంగా నిలిచిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల డీఏ విడుదలకు తాజాగా అనుమతిచ్చింది. ఇప్పుడు పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ అనుమతిచ్చింది. ఒక డీఏ విడుదలకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. దీంతో ప్రభుత్వం ఉద్యోగులకు డీఏను విడుదల చేయనుంది.
ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుండగా, మొదట పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత ఈవీఎంలోని ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు కోసం అన్ని నియోజకవర్గాల్లో 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 500 కు పైగా పోలింగ్ కేంద్రాలున్న ఆరు నియోజకవర్గాల్లో రెట్టింపు సంఖ్యలో టేబుళ్లను ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు తొలి ఫలితం వెలువడే అవకాశం ఉందని తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications