మంత్రి జగదీశ్ రెడ్డికి ఈసీ నోటీసు: వివరణ ఇవ్వకుంటే చర్యలు తప్పవని వార్నింగ్
హైదరాబాద్: తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి షాక్ తగిలింది. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు ఇచ్చింది. అక్టోబర్ 25న ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన ప్రసంగంపై బీజేపీ నేత కపిలవాయి దిలీప్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామంటూ జగదీశ్ రెడ్డి చేసిన ప్రసంగం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని బీజేపీ నేత దిలీప్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, నల్గొండ జిల్లా ఎన్నికల అధికారి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక తెప్పించుకుంది.
జగదీశ్ రెడ్డి చేసిన ప్రసంగం నోట్ను కూడా జిల్లా ఎన్నికల అధికారి పంపారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రాథమికంగా మంత్రి జగదీశ్ రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయపడింది.
ఈ క్రమంలోనే ఈసీ మంత్రి జగదీశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. శనివారం సాయంత్రం 3 గంటల్లోపు జగదీశ్ రెడ్డి వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం నోటీసులో పేర్కొంది. వివరణ ఇవ్వకపోతే తాము చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది.