ఉద్యోగి నుంచి మంత్రి వరకు .. శ్రీనివాస్ గౌడ్ రాజకీయ ప్రస్థానం
హైదరాబాద్ : వీ శ్రీనివాస్ గౌడ్ .. పరిచయం అక్కర్లేని పేరు. ఉద్యోగ సంఘాల నేతగా వారి సమస్యల కోసం పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 16 ఏళ్లు గెజిటెడ్ అధికారిగా పనిచేస్తూనే మరోవైపు టీజీవో సంఘంలో క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయం 2009 నుంచి 2014 వరకు ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అనుబంధంగా ముందుకు నడిచారు.
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ..
మధ్యతరగతి కుటుంబం నుంచి శ్రీనివాస్ గౌడ్ ప్రస్థానం మొదలైంది. ఉమ్మడి పాలమూరులోని అద్దకల్ మండలం రాచర్ల గ్రామంలో 1969లో వీ నారాయణ్ గౌడ్, శాంతమ్మ దంపతులకు జన్మించారు. ఉన్న దాంట్లోనే కొడుకును ఉన్నత చదువు చదివించారు తల్లిదండ్రులు. 1998లో ఉమ్మడి రాష్ట్రంలో కొలువు వచ్చింది. ఇక అక్కడినుంచి ఆయన జీవితం రాజకీయాల వైపు మళ్లింది. శ్రీనివాస్ గౌడ్ కు భార్య .. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఉద్యోగ సంఘాల నేతగా గుర్తింపు
కొలువు వచ్చాక శ్రీనివాస్ గౌడ్ .. తన తోటి ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన ఇతర అంశాలపై ఫోకస్ చేశారు. క్రమంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం అధ్యక్షులుగా ఎదిగారు. 2004 నుంచి మొదలైన తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాల తరఫున పోరాడారు. తర్వాత తెలంగాణ రాజకీయ జేఏసీ కో ఛైర్మన్ గా కూడా వ్యవహరించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. స్వ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ కార్యకర్తలతోపాటు ఉద్యోగులను కూడా మమేకం చేసిన ఉద్యోగ సంఘాల నేతల్లో శ్రీనివాస్ గౌడ్ ముందువరుసలో ఉంటారు.
రాజకీయ ప్రస్థానం ...
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చడంతో తన వంతు పాత్ర పోషించిన శ్రీనివాస్ గౌడ్ .. 2014లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. మార్చి 13న టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో మహబూబ్ నర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఉద్యోగ సంఘాల ఉద్యమ నేత అయిన శ్రీనివాస్ గౌడ్ ను అప్పుడే క్యాబినేట్ లో తీసుకుంటారనే ప్రచారం జరిగింది. అయితే సామాజిక సమీకరణాలు, ఇతర అంశాల ఆధారంగా ఆయనను బెర్త్ వరించలేదు. శ్రీనివాస్ సహా మిగతా నేతలకు కేసీఆర్ పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించారు. ఈ నియామకాన్ని సవాల్ చేస్తూ కోర్టులో కేసు దాఖలవడం .. వారి నియామక ప్రక్రియ నిలిపివేత చకచకా జరిగిపోయాయి. గత ఎన్నికల్లో వివిధ అంశాల ప్రాతిపదికన క్యాబినేట్ ఏర్పడింది. ఈ సారి అందుకు భిన్నంగా ఆరుగురి కొత్తవారికి అవకాశం కల్పించారు. ఇందులో విధేయుడిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ ఒకరు. రెండోసారి మహబూబ్ నగర్ నుంచి పోటీచేసి గెలుపొందిన శ్రీనివాస్ కు ఎట్టకేలకు మంత్రి పదవీ వరించింది.