హైదరాబాద్ నడిబొడ్డున భారీ కబ్జా: విడిపించిన హైడ్రా: డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించే ఛాన్స్
HYDRAA: హైడ్రా తాజా కూల్చివేతలను చేపట్టింది. హైదరాబాద్ నడిబొడ్డున గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కుల్సుంపురాలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలానికి విముక్తి కల్పించింది. ఆక్రమణదారుల నుండి తిరిగి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ స్థలం విస్తీర్ణం.. 1.30 ఎకరాలు. దీని విలువ సుమారు 110 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ స్థలాన్ని ప్రజోపయోగ కార్యక్రమాల కోసం వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గోషామహల్ నియోజకవర్గం ఆసిఫ్నగర్ మండలం కుల్సుంపురాలో సర్వే నంబర్ 50లో గల ఈ 1.30 ఎకరాల స్థలంలో ఆక్రమణదారులు జెండా పాతారు. అశోక్ సింగ్ అనే వ్యక్తి ఈ భూమిని ఆక్రమించినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గుర్తించారు. ఆ స్థలంలో ఓ షెడ్లును నిర్మించి, విగ్రహాలు తయారుచేసే వారికి అద్దెకు ఇచ్చాడని జిల్లా రెవెన్యూ అధికారుల సర్వేలో తేలింది. ప్రభుత్వ భూమిని వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకుంటున్నట్లు నిర్ధారించారు.

దీనికి సంబంధించిన ఓ సమగ్ర నివేదికను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రూపొందించారు. దీన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు పంపించారు. దీనిపై సమగ్ర సర్వేను నిర్వహించింది హైడ్రా. భూఆక్రమణ నిజమేనని తేలడంతో యాక్షన్ లోకి దిగింది. ఈ ఉదయం కూల్చివేత పనులు చేపట్టింది. భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు పోలీసులు. భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఈ భూమి తనదేనంటూ కొన్ని నకిలీ డాక్యుమెంట్లను సృష్టించాడు అశోక్ సింగ్. నాంపల్లి సిటీ సివిల్ కోర్టును సైతం ఆశ్రయించాడు. ఈ కేసు విషయంలో కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. అప్పట్లో కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారులు రెండుసార్లు భూమిని ఖాళీ చేయించారు కూడా. అయినప్పటికీ- అశోక్ సింగ్ మళ్లీ మళ్లీ భూమిని ఆక్రమించుకుని, దాని నుంచి అద్దె వసూలు చేస్తూ వచ్చాడు.
అశోక్ సింగ్ పై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లల్లో కేసులు కూడా నమోదయ్యాయి. అతనిపై రౌడీషీట్ కూడా తెరిచారు పోలీసులు. లంగర్హౌస్, మంగళ్హాట్, షాహినాయత్గంజ్ పోలీస్ స్టేషన్లలో అతనిపై ఎనిమిదికి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోన్నట్లు చెబుతున్నారు.
ఇదివరకు గాజలరామారం-కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ప్రభుత్వ స్థలంలో భారీగా వెలిసిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. అక్రమంగా నిర్మించుకున్న కట్టడాలను తొలగించింది. ప్రభుత్వ భూములను విడిపించింది. దాదాపు 317 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి హైడ్రా అధికారులు తిరిగి తీసుకున్నారు. ఈ భూమి విలువ 12,000 కోట్ల నుండి 15,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా.












Click it and Unblock the Notifications