ఎవరతను?: 'టీడీపీ అన్ని పదవులు, టీఆర్ఎస్లో చెల్లని పైసాగా మారాడు'
హైదరాబాద్: తెలంగాణలో టీడీపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పాదయాత్ర నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి తెలిపారు. గురువారం హన్మకొండలో టీడీపీ మండలాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల వర్క్షాపు, జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తల్లో మనోధైర్యాన్ని కల్పించేందుకు ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు పాదయాత్ర చేస్తానన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రాభవం క్రమంగా తగ్గుతోందన్నారు. ఆ పార్టీకి ఓట్లు 66 నుంచి 46 శాతానికి పడిపోయాయన్నారు.
రాజకీయంగా భిక్ష పెట్టి, అన్ని పదవులను కట్టబెట్టిన టీడీపీకి ఎర్రబెల్లి దయాకర్రావు ద్రోహం చేసి టీఆర్ఎస్లో చేరాడని, అక్కడ చెల్లని పైసగా మారాడని విమర్శించారు. టీడీపీలో ఉన్నప్పుడు పదవులు ఇవ్వకుంటే దయాకరరావు ఇంకా రేషన్ డీలర్గానే ఉండేవాడని రేవంత్ ఎద్దేశా చేశారు.
టీడీపీ ఎర్రబెల్లికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. అలాంటిది నేడు కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితిలో ఉన్నాడని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రజలు తాగు నీటికి తండ్లాడుతుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
ఐపీఎల్ మ్యాచ నిర్వహిస్తే నీరు భారీగా ఖర్చవుతుందని భావించిన మహారాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రజల దాహార్తిని దృష్టిలో పెట్టుకొని మ్యాచకే అనుమతివ్వలేదు. నాగపూర్ ప్రాంత ప్రజలు మంచి నీటి కోసం అల్లాడుతుంటే రైలు ద్వారా నీటిని తరలించారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది.
ప్రజలు తాగునీటి కోసం తంటాలు పడుతుంటే పట్టించుకోకుండా బీర్ల కంపెనీలకు, బార్ల యజమానులకు లక్షలాది లీటర్ల నీటిని అమ్ముతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా తాను హైకోర్టులో కేసు వేస్తానన్నారు. ఈ మేరకు అడ్వకేట్తో మాట్లాడానని చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్రెడ్డి, ఉపాధ్యక్షుడు గరికపాటి మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.