చెప్పుతో కొట్టినా సిగ్గులేదా?, ఆ రైతుకు పాదాభివందనం: ప్రభుత్వంపై విరుచుకుపడిన ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులు చెప్పుతో కొట్టినా ప్రభుత్వానికి సిగ్గులేదా? అని ప్రశ్నించారు. రైతు బిడ్డలు చెప్పుతో సమాధానం చెప్పారని అన్నారు. ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా చెప్పుతో కొట్టిన ఆ రైతు బిడ్డకు పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు.
శనివారం ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. మిగితా రైతులు కూడా చెప్పుతోనే సమాధానం చెప్పాలని, అప్పుడైనా ప్రభుత్వానికి రైతుల బాధలు తెలుస్తాయని అన్నారు. రైతును ఆదుకోవడం టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
సమస్యలు తీర్చాలని ఉద్యమిస్తే రైతులపై లాఠీ ఛార్జీలు చేయిస్తారా? అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. చెప్పుతో కొట్టిన రైతును సైకో అంటున్నారని, రైతులను సైకోలు చేసి అవమానిస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సైకో అయితే మెంటల్ ఆస్పత్రికి తరలించాలి కానీ, జైల్లో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.
తమ సమస్యలు పరిష్కరించేంత వరకూ రైతులందరూ ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీయాలని పిలుపునిచ్చారు. లక్ష రూపాయల రుణమాఫీ, గిట్టుబాటు ధర, ఆత్మహత్యలు ఆగేవరకు ప్రభుత్వానికి రైతులు చెప్పులతోనే బుద్ధి చెప్పాలని అన్నారు. రైతుల సమస్యలు తీర్చే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు.
వరంగల్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పైకి ఓ రైతు చెప్పు విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎర్రబెల్లి పై వ్యాఖ్యలు చేశారు.