ఎర్రబెల్లి అన్ స్టాపబుల్.!అన్ ప్లగ్గుడ్.!ప్రేమతో దయాకర్.!మునుగోడులో ఊపేస్తున్న మంత్రి.!
మునుగోడు/హైదరాబాద్ : తెలంగాణ మంత్రులందరిలో కన్నా ఎర్రబెల్లి దయాకర్ రావు మంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో అందరి మంత్రులకన్నా ఒకడుగు ముందుండి ప్రచారం నిర్వహిస్తున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అంతే కాకుండా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి వరంగల్ జిల్లా హవా నడుస్తున్నట్టు తెలుస్తోంది. చండూరులో పాలకుర్తి నియోజకవర్గ పవర్ పని చేస్తున్నట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక కు నోటిఫికేషన్ వెలువడిన వెంటనే పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రశేఖర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు మునుగోడు ప్రచార బాధ్యతలు అప్పగించారు.
మునుగోడులో ఎర్రబెల్లి మార్క్ ప్రచారం..
ఒక్కో నేతకు ఒక్కో ప్రాంతాన్ని, గ్రామాలను, మున్సిపాలిటీ వార్డులను కేటాయించారు. రెండు లేదా మూడు వేల ఓట్లకు ఒక ఇంచార్జీని నియమించారు. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరితో పాటు ఎమ్మెల్యేలకు, వరంగల్ మహానగర మేయర్ గుండు సుధారాణికి కూడా పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించారు. వాళ్లందరూ గత నాలుగైదు రోజులుగా వారికి కేటాయించిన ప్రాంతాల్లో మకాం వేశారు. ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. దీంతో మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా వరంగల్ నేతలే కనిపిస్తున్నారు.
మునుగోడులో వరంగల్ హవా..
మరోవైపు పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనదైన శైలి లో ప్రచారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారారు. ప్రజల పనుల్లో, దైనందిక వ్యవహారాల్లో మంత్రి భాగస్వామ్యం పంచుకుంటున్నారు. ప్రతి ఒక్క ఓటరుతో మాట్లాడుతూ, వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? అని ఆరా తీస్తున్నారు. డప్పు చప్పుళ్లతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ వెళుతూ, టీఆరెఎస్, కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రజలను కలుస్తూ, వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ, వారితో మాట్లాడుతూ, ఫోటోలు దిగుతూ, తిరిగి ఆ ఫోటోలను తన అనుచరులతో ప్రజలకు పంపిస్తూ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు.
ఎర్రబెల్లి వినూత్న ప్రచారం..
మంత్రి ఎర్రబెల్లికి అండగా, తోడుగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గం నుండి వందలాదిగా పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా చండూరుకు వెళుతూ, మంత్రి ఎర్రబెల్లితో పాటుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో ప్రచారానికి మంచి ఊపు వస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజల్లో కూడా మంచి చర్చ జరుగుతోంది. పార్టీనీ, పార్టీ అభ్యర్థిని, ప్రభుత్వ పతకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఇదే సమయంలో పలు చోట్ల ప్రజలతో ఏర్పాటు చేసిన వేర్వేరు సమావేశాల్లో మంత్రి ఎర్రబెల్లి ఉత్సాహవంతంగా మాట్లాడుతున్నారు.
అభ్యర్ధిని గెలిపించుకుంటేనే అభివృద్ది..
మునుగోడు ప్రజలకు ప్రస్తుతం ఎన్నికలు ఎందుకు వచ్చాయి? ఎవరి స్వార్థం కోసం వచ్చాయి? ప్రజల కర్తవ్యం ఏంటి? అనే అంశాలను వారికి అర్థం అయ్యేలా ఎర్రబెల్లి ప్రసంగిస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాలకుర్తి నియోజకవర్గం నుండి ప్రచారం కోసం వెళ్ళిన నేతలు తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి మునుగోడులో వరంగల్, పాలకుర్తి పట్టణాల హవా కొనసాగుతున్నట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్ని విధాల ఊపేస్తున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.